KIM Eliminate: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. తరుచు వార్తల్లో ఉండే వ్యక్తి కూడా. కిమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నార్త్ కొరియా అధ్యక్షుడికి టార్గెట్ ఫిక్స్ చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇదే విషయాన్ని స్వయంగా ఉత్తర కొరియాకు శత్రుదేశంగా భావించే దక్షిణ కొరియా రక్షణశాఖ మంత్రి షిన్ వన్ సిక్ బహిరంగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి బాంబు పేల్చాడు. దక్షిణ కొరియా మిలటరీ ఇందుకు సంబంధించిన డ్రిల్స్ కూడా చేశాయి అని క్లియర్గా అర్థమవుతుంది. గతేడాది డిసెంబర్ అంటే నెల రోజుల క్రితమే నార్త్ కొరియా సరిహద్దు ప్రాంతంలో దక్షిణ కొరియా అణ్వాయుధాలను మోహరించాయి. అంతేకాదు ఆ దేశం చేపట్టిన సైనిక విన్యాసాల్లో అమెరికా కూడ పాలుపంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా కూడా కిమ్ తన న్యూక్లియర్ ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకోవాలని చేసిన ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలుగా తెలుస్తోంది. అయితూ దక్షిణ కొరియా గడిచిన ఆరేళ్లలో ఎక్కడా కూడా కిమ్ జంగ్ ఉన్ ను మట్టుబెట్టే దానిపై బహిరంగంగా మాత్రం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు సడెన్ గా ఈ వార్త బయటకు రావడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
కిమ్.. స్టైలే వేరు. ఆయన వ్యవహారమే వేరు. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ ఎఫెక్టే వేరుగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే! ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన నేపథ్యంలో కిమ్ ఒక్కసారిగా మాటల బాంబు పేల్చారు. ప్రపంచానికి వార్ విషెస్ చెప్పారు. వాస్తవానికి కొత్త ఏడాది సందర్భంగా ఎవరైనా శుభాకాంక్షలు చెబుతాం. కానీ.. కిమ్ మాత్రం యుద్ధం అనివార్యమంటూ హెచ్చరికలు జారీ చేశారు. సౌత్ కొరియా, అమెరికా కవ్విస్తే ఆ రెండు దేశాలనూ నాశనం చేసేంత వరకూ వదిలి పెట్టకూడదని ఆర్మీకి ఆదేశాలిచ్చారు. తమతో యుద్ధం చేయడానికి ముందుకొస్తే పూర్తిగ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దక్షిణ కొరియా, అమెరికా ఈ మధ్య కాలంలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు దేశాలూ ఆయుధాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ మైత్రిపైనే కిమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.
న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా కిమ్.. తన మిలటరీ కమాండర్లతో సమావేశమయ్యారు.ఆ సందర్భంగా తన సైన్యానికి కీలక ఆదేశాలిచ్చారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దంటూ అమెరికా, దక్షిణకొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ఇకపై దక్షిణకొరియాతో రాజీ అనే ప్రయత్నాలు ఉండవని చెప్పారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా పదేపదే కవ్వింపులకు పాల్పడుతోందని మండి పడ్డారు. అదే జరిగితే సౌత్ కొరియా మూలాలు కూడా చెరిపేయాలని, ఫుల్ ఫోర్స్ వినియోగించి దాడులు చేయాలని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న దేశాలతో భవిష్యత్ లోనూ ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని కిమ్ చప్పారు. మరోవైపు దేశంలోని ఆయుధ తయారీదారులకు గత వారం కిమ్ జోంగ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. అమెరికాతో ఎలాంటి ఘర్షణ తలెత్తినా.. ఎదుర్కొనేందుకు వీలుగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని చెప్పారు.
అమెరికా, దక్షిణ కొరియా కలిసి సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్న తరుణంలో.. వాటిని ఎదుర్కోవడం కోసం యుద్ధం అనివార్యమని కిమ్ తెగేసి చెప్పాడు. 2023లో ఉత్తర కొరియా ప్రయోగించిన తొలి నిఘా శాటిలైట్ విజయవంతమైంది. దీంతో ఈ ఏడాది మూడు అదనపు నిఘా శాటిలైట్స్ ను సిద్ధంగా ఉంచి పరీక్షించాలని ఆదేశించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అమెరికా, దక్షిణ కొరియాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్ నొక్కి చెప్పడం ఇప్పుడు ఓ విధంగా కొత్త సంవత్సరంలో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.
ఉత్తర కొరియాలో 2006లో తొలిసారి న్యూక్లియర్ టెస్టు నిర్వహించారు. అప్పటి నుంచే యునైటెడ్ నేషన్స్ అణ్వాయుధాలను వీడాలని ఆ దేశానికి వ్యతిరేకంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టింది. కానీ వాటిని నార్త్ కొరియా పెద్దగా పట్టించుకోలేదు. ఇక 2018-19 మధ్యకాలంలో కిమ్- అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ మూడుసార్లు పలు సందర్భాల్లో కలుసుకున్నారు. కానీ చర్చలు మాత్రం ఫలించలేదు. 2022 నుంచి ఉత్తర కొరియా దాదాపుగా వందకుపైగా మిస్సైల్ టెస్టులు నిర్వహించింది. అదే సమయంలో నార్త్ కొరియా చైనా, రష్యాతో మైత్రి పెంచుకుంటూ వస్తోంది.
1953లో సైనిక ఘర్షణ తర్వాత కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. కానీ, అప్పట్లో యుద్ధ విరమణ ప్రకటన చేయలేదు. దీంతో సాంకేతికంగా రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అది నెరవేరడం అసాధ్యంగా మారింది. కిమ్ అధికారం చేపట్టాక.. ఇవి పతాక స్థాయికి చేరాయి. కిమ్ తాజా ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంటేనే ఓ నియంత అని పేరుంది. అనుకున్నది సాధించుకోడం కోసం ఎంతకైనా తెగిస్తారు. జాలి, దయ, కరుణ ఇవేమీ ఉండవు. కిమ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ మాటలే వినిపిస్తాయి. అలాంటి వ్యక్తి నయా సాల్ ముబారక్ చెప్పాల్సిన టైంలో.. ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి తాను ఎలాంటివాడో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు. శాంతి కోసం ప్రపంచం పాకులాడితే.. కిమ్ మాత్రం వార్ వార్ అంటూ రెచ్చగొట్టడం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.
.
.