Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో ఆమె విరాళల సేకరణలో దూసుకెళ్తున్నారు. అయితే, బైడెన్ వైదొలిగిన తరువాత బరిలోకి దిగిన ఆమె.. వారం వ్యవధిలోనే దాదాపు రూ. 20 కోట్ల డాలర్లను సేకరించింది. ఇటు పార్టీలోనూ, అటు ట్రంప్ తో పోటీ విషయంలో కమలా హారిస్ దూసుకెళ్తున్నారు. ఆమె ప్రచార బృందం ఒక విషయాన్ని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనున్నదని, తక్కువ ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారని పేర్కొన్నది.
టీమ్ కమలా హారిస్ రికార్డు స్థాయిలో 200 మిలయన్ డాలర్ల విరాళాలు సేకరించగా, అందులో 66 శాతం మొదటిసారి దాతల నుంచే రావడం గమనార్హం. అదేవిధంగా 1.70 లక్షల మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో లభిస్తున్న విశేష ఆదరణకు ఇదే నిదర్శనమంటూ హరీస్ ఫర్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖెల్ టైలర్ అన్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించి వారమే అయినా.. డెమోక్రాట్ల మద్దతు పొందినట్లు చెప్పుకొచ్చారు. రికార్డు స్థాయిలో విరాళాల సేకరణ మొదలు.. పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడగట్టడం వరకు.. ట్రంప్ – వాన్స్ జోడిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హారిస్ తో సంవాదం జరిపేందుకు ట్రంప్ భయపడుతున్నారని ఆరోపించారు.
Also Read: విరిగిపడిన మట్టి చరియలు.. 11 మంది మృతి
‘ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ దూసుకెళ్తుండడం, పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడం వాస్తవం. అయితే, ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నది. పలు రాష్ట్రాల్లోని తక్కువ ఓటర్లే అధ్యక్ష విజయావకాశాలను నిర్ణయిస్తారు. ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాం. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం’ అంటూ టైలర్ ఆశాభావం వ్యక్తం చేశారు.