Japan Earthquake Update(International news in telugu):
జపాన్ లో న్యూ ఇయర్ రోజున వచ్చిన వరుస భూకంపాలు ఇప్పటికీ అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భూకంపాల ధాటికి భవంతులు కూలడంతో.. శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్క మృతదేహం బయటపడుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 62 మంది మృతి చెందినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
జనవరి 1న 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఇషికావా ప్రిఫెక్చర్ అతలాకుతలమైంది. నోటో ద్వీపకల్పంపై భూకంపాల తీవ్ర అధికంగా ఉంది. వేల భవనాలు నేల కూలగా.. కొన్ని ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 62 మంది మరణించగా.. మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 20 మంది పరిస్థితి విషంగా ఉందని అధికారులు తెలిపారు. అలాగే ప్రకృతి విలయంలో 32 వేల మంది నిరాశ్రయులుగా మారారని, వారంతా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. సుజు పట్టణంలో 90 శాతం ఇళ్లు ధ్వంసమైనట్లు మేయర్ మషురో ఇజుమియా తెలిపారు.
నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జపాన్ ప్రధాని పుమియో కిషిదా బుధవారం వెల్లడించారు. ఒకవైపు భూకంపాలతో తీవ్రవిషాదంలో ఉన్న జపాన్ ప్రజలకు అక్కడి వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. బుధవారం భారీ వర్షాలు పడొచ్చని, కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కొండచరియలకు సమీపంలో ఉన్నవారు సురక్షితప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.