Japan Earthquake Update: న్యూ ఇయర్ రోజున సంభవించిన భూకంపం జపాన్ను గజగజలాడించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో ఇంకా శిధిలాల కింద ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
నిన్న సాయంత్రం 4 గంటల ఆరు నిమిషాలకు మొదటిసారి భూమి కంపించింది. అప్పటి నుంచి నూట యాభై ఐదు సార్లు కంపించిన భూమి రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతను నమోదు చేసింది. భూకంపం దాటికి సముద్రంలో ఐదు అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అంతేకాదు.. పశ్చిమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
ఇషిగావాకు అతిపెద్ద సునామీ హెచ్చరిక, మిగిలిన పశ్చిమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే.. కాసేపటికి సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖంపట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. వాతావరణం సాదారణంగా లేకపోవడంతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు సరిగా పనిచేయడం లేదు.
భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపాలు, సునామీల దాటికి గతంలో జపాన్ ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంటున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అటు.. జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు సమాచారం, సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయం కోసం అక్కడున్న భారతీయులు +81-80-3930-1715, +81-70-1492-0049, +81-80-3214-4734, +81-80-6229-5382, +81-80-3214-4722 నంబర్లను సంప్రదించాలని తెలిపింది.
.
.