Cyber war : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకర రూపు దాలుస్తోంది. నానాటికీ ఇరువైపులా మరణాల సంఖ్య పెరుగుతోంది. మూడో రోజు గాజాలో 436 మంది చనిపోగా.. ఇజ్రాయెల్లో 700కి పైగా మరణాలు సంభవించాయి. ఇదంతా కంటికి కనిపించేదే. చాప కింద నీరులా.. ఎవరికీ తెలియని మరో పోరు విస్తృతమవుతోంది. అదే సైబర్ యుద్ధం!
ఇజ్రాయెలీ సంస్థలు, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ హాక్టివిస్టులు చెలరేగిపోతున్నారు. సైబర్ దాడులకు తెగబడుతున్నారు. వీరితో పాటు సైబర్ గ్యాంగ్లు కూడా రంగప్రవేశం చేశాయి. రష్యాకు చెందిన ప్రముఖ హ్యాకర్ గ్రూప్ కిల్నెట్ వాటిలో ఒకటి. ఆదివారం సాయంత్రం ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్ gov.il కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. ఆ సైట్పై సైబర్ దాడి చేసింది తామేనని సామాజిక మాధ్యమం టెలిగ్రాం ద్వారా కిల్లర్నెట్ వెల్లడించింది.
‘2022లో ఉక్రెయిన్ ఉగ్రవాద రాజ్యానికి మద్దతు పలికి రక్తపాతానికి కారణమైంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇక అన్ని ప్రభుత్వ వ్యవస్థలూ మా దాడులను చవిచూడాల్సిందే’ అంటూ తాము హ్యాక్ చేసిన వెబ్సైట్లో పేర్కొంది. అయితే తాము ఇజ్రాయెలీ పౌరులను మాత్రం టార్గెట్ చేయబోవడం లేదని స్పష్టం చేసింది. ఇక ఇస్లామిక్ హ్యాక్టివిస్ట్ గ్రూప్లైన మిస్టీరియల్ టీం బంగ్లాదేశ్, ఎనానమిస్ సూడాన్, టీం ఇన్సేన్ పాకిస్థాన్ కూడా రంగంలోకి దిగాయి. ఓపీ ఇజ్రాయెల్, ఓపీ ఇజ్రాయెల్ వీ2 సంకేతనామాలతో హమాస్, పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్పై సైబర్ దాడులను ముమ్మరం చేశాయి.
అకౌంటెంట్ జనరల్ వెబ్ సైట్, ఆఖరికి ఇజ్రాయెల్ నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఇజ్రాయెల్ పటిష్ఠమైన సైబర్ సెక్యూరిటీ ముందు ఇస్లామిక్ హ్యాకర్ల ఆటలు సాగలేదు. ఆయా వెబ్సైట్లతో పాటు ఇజ్రాయెల్ అధికారిక వెబ్సైట్లన్నీ జియోలాకింగ్ చేసి ఉండటంతో హ్యాకర్లు తోకముడవక తప్పలేదు. వెబ్సైట్లనే కాకుండా.. ఓ దశలో ఇజ్రాయెల్ గగనతల నిఘా వ్యవస్థ ఐరన్ డోమ్ను సైతం హ్యాక్ చేసేందుకు విఫలయత్నం జరిగింది.
రష్యా అనుకూల ఎనానమిస్ సూడాన్ హ్యాకర్ గ్రూప్ ఇజ్రాయెల్ మీడియా సంస్థలను సైతం టార్గెట్ చేసింది. ప్రముఖ వార్తా పత్రిక జెరూసలేం పోస్ట్ వెబ్సైట్పై దాడి చేయడంతో 5 గంటల పాటు స్తంభించిపోయింది. అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా భారత హ్యాకింగ్ గ్రూపులు రంగంలోకి దిగాయి. ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాకర్ల బృందం పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్(paltel.ps)తో పాటు హమాస్ వెబ్సైట్(hamas.ps)ను స్తంభింపచేసింది.