ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో బాధితుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. మరో ఈ యుద్ధంలో కీలక పరిణామం జరిగింది. హమాస్కు మద్ధతుగా ఇప్పటికే హిజ్బూల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు జరుపుతుండగా.. ఇప్పుడు తాజాగా యెమెన్కు చెందిన తీవ్రవాద సంస్థ హౌతీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులతో పాటు.. పలు క్షిపణులను ప్రయోగించినట్టు ప్రకటించింది. హౌతీ దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది. అయితే హౌతీ క్షిపణులు వాటి లక్ష్యాలను చేరుకోకముందే ఈజిప్ట్లో కూలిపోయినట్టు ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇజ్రాయెల్-హమాస్ వార్.. మరింత విస్తరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఉగ్రసంస్థలన్ని ఏకమవ్వడం కలకలం రేపుతోంది. లెబనాన్, సిరియా వైపు నుంచి హిజ్బుల్లా.. యెమెన్ నుంచి హౌతీ ఇజ్రాయెల్పై దాడులు జరుపుతున్నాయి. ఈ సంస్థల వెనుక ఇరాన్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. పాలస్తీనా ప్రజల కోసమే ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నామని ఈ సంస్థలు చెబుతున్నాయి.
ఇక గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్స్ట్రైక్స్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దాడుల్లో 50 మందికి పైగా మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. అయితే తాము జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్ను హతమార్చినట్టు తెలిపింది. అతని ఫోటోను సైతం విడుదల చేసింది. అయితే సామాన్య పౌరులను చంపి.. వాటిని కప్పుపుచ్చుకోవడానికి తమ కమాండర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు హమాస్ ప్రకటించింది.
శరణార్ధి శిబిరంపై ఎయిర్స్ట్రైక్స్ చేయడాన్ని పలు దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ తీరుకు నిరసనగా పలు దేశాలు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. వెంటనే తమ దౌత్యవేత్తలు వెనక్కి రావాలంటూ బొలివియా, కొలంబియా, చిలీ దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు తమ చెరలో ఉన్న విదేశీ బంధీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.