Israel-Hamas Truce : ఇజ్రాయెల్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండో బ్యాచ్ బందీలను విడుదల చేసింది హమాస్. రెండో బ్యాచ్లో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు థాయ్లాండ్ పౌరులను విడిచి పెట్టింది. అయితే బందీలను విడిచి పెట్టే ముందు హైడ్రామా కొనసాగింది. బందీల అప్పగింతలో హమాస్ ఆలస్యం చేసింది. దీంతో బందీలు విడుదలవుతారా? లేదా? అన్న టెన్షన్ నెలకొంది.
బందీల విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. మరికాసేపు చూసి గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ను తిరిగి ప్రారంభిస్తామంది డెడ్లైన్ విధించింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బందీలను అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 17 మంది ఇజ్రాయెల్ చేరుకున్నారని అధికారులు నిర్ధారించారు.
అయితే ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ హమాస్ ఆరోపించింది. అందుకే రెండో బ్యాచ్ బందీలను ఆలస్యంగా విడుదల చేసింది. ఈ ఒప్పందానికి ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తులు ఖైదీలను ఎంపిక చేస్తుండగా ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటోందని, ఇక సంధి ఉన్నప్పటికీ గాజాలో పౌరులను చేరుకునేందుకు ఎలాంటి సహకారం అందించడంలేదని హమాస్ మండిపడింది. అయితే ఈ వాదనలను ఇజ్రాయెల్ అధికారులు ఖండించారు. అన్ని షరతులను పాటిస్తున్నామంటూ సానుకూలంగా స్పందించింది.
ఇజ్రాయెల్ కూడా రెండో బ్యాచ్ ఖైదీల అప్పగింతలో 39 మంది పాలస్తీనా ఖైదీలను అప్పగించింది. ఇందులో 33 మంది పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరికి బదులుగా 13 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందానికి ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. బందీల ఎంపిక, వారిని విడుదల చేయడంలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మంది ఇజ్రాయెల్ పౌరులు విడుదలయ్యారు.
ఇక నేడు మూడో బ్యాచ్ బందీలు విడుదల కానున్నారు. దీనికి సంబంధించిన లిస్ట్ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. మరోవైపు కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో గాజాకు మానవతా సాయం అందుతుంది.