Israel Hits UN Base| లెబనాన్ దేశంలో హిజ్బుల్లా మిలిటంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం ఐకరాజ్యసమతి(ఐరాస) పీస్ కీపర్స్ (శాంతి దూతల) కేంద్రంపై ట్యాంకర్ తో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఐరాస్ పీస్ కీపర్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి గురువారం అక్టోబర్ 10, 2024న జరిగింది. అయితే ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ముఖ్యంగా ఐరాస్ పీస్ కీపర్స్ మిషన్ లో సభ్యులైన యూరోపియన్ దేశాలు ఈ దాడి ఖండిస్తూ.. ఇజ్రాయెల్ తీరుని తీవ్రంగా విమర్శించాయి.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. దక్షిణ లెబనాన్ లో ఐరాస పీస్ కీపర్స్ కేంద్రం సమీపంలో హిజ్బుల్లా మిలిటెంట్లు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని. తాము ఐరాస్ పీస్ కీపర్స్ని అక్కడి నుంచి తొలగిపోవాలని ముందే హెచ్చరించినా వారు వెళ్లలేదని.. తప్పని పరిస్థితుల్లో దాడి చేశామని వివరించింది.
1978 సంవత్సరంలో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం తరువాత లెబనాన్ దేశంలో యుద్ధ లాంటి పరిస్థితులు నివారించడానికి ఐక్యరాజ్యసమితి తరపున యూనిఫిల్ (United Nations Interim Force in Lebanon) ని ఏర్పాటు చేశారు. లెబనాన్ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగకుండా ఆపేందుకు ఈ యూనిఫిల్ పనిచేస్తుంది. ముఖ్యంగా పౌరుల భద్రత దీని ముఖ్య ఉద్దేశం. అయితే గురువారం నఖురా ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు పీస్ కీపర్స్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడడంతో సభ్యదేశమైన ఇటలీ మండిపడింది.
Also Read: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్
ఆ ఇద్దరు పీస్ కీపర్స్ కార్యకర్తలు ఇండోనేషియాకు చెందినవారు. దీంతో ఇండోనేషియా ఐరాస అంబాసిడర్ కూడా ఇజ్రాయెల్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఏ మాత్రం గౌరవించదని ప్రపంచ శాంతి కోసం ఇతర దేశాలు చేస్తున్న కృషికి ఇజ్రాయెల్ దృష్టిలో విలువలేదని అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటలీ రక్షణ శాఖ మంత్రి ఈ దాడి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ”ఈ దాడి ఏదో పొరపాటున జరగలేదు. ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఈ దాడులు యుద్ధ నేరాల కింద పరిగణించబడతాయి. దీనికి ఇజ్రాయెల్ సమాధానం చెప్పాలి.” అని అన్నారు.
మరోవైపు స్పెయిన్ విదేశాంగ మంత్రి ఈ దాడి చేయడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని. ఇది చాలా సీరియస్ అని అన్నారు. అలాగే ఐర్లాండ్ ప్రధాన మంత్రి కూడా ఐరాస్ భద్రతా దళాలు, పీస్ కీపర్ కార్యకర్తల భద్రతకు ఇజ్రాయెల్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు.
కానీ ఇజ్రాయెల్ కు అండగా నిలిచే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ కాస్త జాగ్రత్త వహించాలని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసింది.
అయితే ఐరాస పీస్ కీపర్స్ చీఫ్ జీన్ పియర్ లక్రొయిక్స్ మాత్రమ లెబనాన్ లో పీస్ కీపర్స్ కార్యకర్తల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్న ప్రాంతాల నుంచి 75 శాతం పీస్ కీపర్స్ కార్యకర్తలను మిగతా ప్రాంతాలకు తరలించామని.. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సిన అవసరముందని అన్నారు.
ఇప్పటివరకు గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 200 మంది ఐరాస్ కార్యకర్తలు చనిపోయారు. ఈ మరణాలపై అటు అమెరికా, యూరోప్ దేశాలు లేదా ఐరాస్ ప్రతినిధులు ఇజ్రాయెల్ ఆపడంలో విఫలమయ్యారు. మరోవైపు లెబనాన్ లో నెలరోజులకు పైగా జరుగుతున్న యుద్ధంలో 1200 మంది చనిపోయారు.