Kohinoor Diamond: కోహినూర్ వజ్రం సహా ప్రాచీన భారతీయ విగ్రహాలు, కళాఖండాలను బ్రిటన్ నుంచి తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించనుందా? ఔననే అంటోంది బ్రిటన్ మీడియా. మోదీ ప్రభుత్వం త్వరలో దౌత్య పరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయబోతోందని.. బ్రిటన్కు చెందిన “ది టెలిగ్రాఫ్” పత్రిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాల్లో ఇది ఒకటని తెలిపింది.
ఈస్టిండియా కంపెనీ హయాం నుంచి మొదలుపెట్టి.. స్వాతంత్ర్యం తర్వాత కూడా రహస్యంగా బ్రిటన్ మ్యూజియాలకు చేరిన భారతీయ కళా సంపదను తిరిగి సొంతం చేసుకోవడానికి.. లండన్లోని దౌత్యవేత్తలతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సంప్రదింపులు జరపబోతున్నారు. వేలాది భారత విగ్రహాలు, కళాఖండాలు, వస్తువులను తిరిగి భారత్కు అప్పగించాలని కోరబోతున్నారు. ముందుగా చిన్న మ్యూజియాల నుంచి, ఆ తర్వాత పెద్ద మ్యూజియాల నుంచి కళాఖండాలను సేకరించాలని, ఆ తర్వాత కోహినూర్ వజ్రం కోసం ప్రయత్నాలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు బ్రిటన్ మీడియా అంటోంది.
105 క్యారెట్ల బరువున్న కోహినూర్ వజ్రం.. మహారాజా రంజిత్ సింగ్ నుంచి ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఆ కంపెనీ కోహినూర్ని విక్టోరియా రాణికి బహూకరించింది. అప్పటి నుంచి ఆ వజ్రం బ్రిటన్ రాజ కుటుంబీకుల దగ్గరే ఉండిపోయింది.
స్వాతంత్య్రం వచ్చాక వివిధ దేశాల్లో ఉన్న 250కి పైగా భారతీయ కళాఖండాలను తిరిగి స్వదేశానికి రప్పించగలిగారు ASI అధికారులు. మరో వందకు పైగా కళాఖండాలను బ్రిటన్, అమెరికా నుంచి భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావాలనేది భారతీయుల కోరిక. ఆ దిశగా ప్రయత్నాలు ఫలిస్తాయా? కోహినూర్ మళ్లీ మన సొంతం అవుతుందా?