Mars missions : నాసా ఇంజనీర్లు, మార్స్ మిషన్ల మధ్య కమ్యూనికేషన్లకు విరామం వచ్చింది. మార్టియన్ స్పేస్క్రాఫ్ట్, అంగారకుడిపై అన్ని రోబోటిక్ మిషన్లకు ఈ నెల 11 నుంచి అన్ని రకాల కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. శనివారం(25వ తేదీ) తర్వాత కానీ అవి పునరుద్ధరణ కావు.
ఇందుకు కారణం సౌర సంయోగం(solar conjunction). మార్స్ పై పరిశోధనలకు ఉద్దేశించిన వ్యోమనౌకలపై దీని ప్రభావం పడుతుంది. వినువీధిలో ప్రకాశవంతంగా కనిపించే అంగారక గ్రహం అదృశ్యమైంది. భూమికి, ఆ గ్రహానికి మధ్యగా సూర్యుడు వచ్చి చేరడమే దీనికి కారణం. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఖగోళ ప్రక్రియ చోటు చేసుకుంటుంది.
దినకరుడికి చెరో పక్కన భూమి, అంగారకుడు ఉండటం వల్ల ఈ రెండు గ్రహాలు ఒకదానినొకటి తాత్కాలికంగా చూసుకోలేవు. అందుకే 14 రోజుల సోలార్ కంజక్షన్ సమయంలో మార్స్ గ్రహం మనకు కనిపించదు. అంతే కాదు.. రెండు గ్రహాల మధ్య కమ్యూనికేషన్లకు కీలకమైన రేడియో సిగ్నళ్లను సూర్యుడి కరోనా నుంచి వెలువడే వేడి వాయువులు అడ్డుకుంటాయి.
ఒకవేళ రోవర్లు, ఆర్బిటర్లు, మార్స్ హెలికాప్టర్ ఏదైనా సమాచారాన్ని పంపినా.. సూర్యుడి చార్జ్డ్ పార్టికల్స్తో వాటికి అంతరాయం ఏర్పడుతుంది. భూమిపై నుంచి మార్స్ మిషన్లకు ఈ సమయంలో కమాండ్లు పంపడం మరీ డేంజర్. సౌర చార్జ్డ్ పార్టికల్స్ వల్ల ఆ కమాండ్ల చేరవేతలో గందరగోళం నెలకొంటే మొత్తం మిషన్కే ముప్పు ఏర్పడొచ్చు.
అందుకే నాసా శాస్త్రవేత్తలు కమ్యూనికేషన్ల వ్యవస్థను తాత్కాలికంగా ఆఫ్ చేశారు. అంతమాత్రాన అంగాకర గ్రహంపై రోవర్లు, ఆర్బిటర్లు హాలీడే తీసుకుంటాయని అర్థం కాదు. వాటి పని అవి చేస్తూనే ఉంటాయి.
గత రెండు దశాబ్దాలుగా నాసా, ఇటీవల చైనా అంతరిక్ష సంస్థ CNSA అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్నాయి. సౌర సంయోగ సమయంలో ఈ అంతరిక్ష నౌకలు రెండువారాలుగా కమ్యూనికేషన్ను కోల్పోయాయి.