Longest Sea Bridge : దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన నేడు ప్రారంభం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మించారు. రూ.21,200 కోట్ల వ్యయంతో ఈ 21.8 కి.మీ ఈ వంతెనను నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సేవలకు గుర్తింపుగా ఈ వంతెనకు ‘అటల్ బిహారీ వాజ్పేయి శివది న్వశేవ అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీనిని నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ ఈ సేతువు నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవా షేవా ప్రయాణానికి 2 గంటలు పడుతుండగా.. ఈ వంతెన వల్ల అది 20 నిమిషాలకు తగ్గనుంది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రి నుండి ప్రారంభమై ఎలిఫెంట్ ఐలాండ్కు ఉత్తరాన థానే క్రీక్ను దాటి న్హావా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది. ఆరు వరుసలుగా నిర్మించిన ఈ వంతెనపై రోజుకు 70వేలకు పైగా వాహనాలు ప్రయాణించొచ్చు. ఈ బ్రిడ్జిపై ఒకవైపు ప్రయాణానికి రూ.250 టోల్ వసూలు చేయనున్నారు. వంతెన పొడవునా.. 400 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కేవలం కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులను మాత్రమే ఈ వంతెన మీదకు అనుమతిస్తారు. టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. పర్యావరణహితంగా నిర్మితమైన ఈ వంతెన వల్ల చలికాలంలో ఇక్కడకు వలస వచ్చే ఫ్లెమింగో పక్షులకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జిపై సౌండ్ బారియర్ ఏర్పాటు, సముద్రజీవులకు నష్టం కలగించని దీపాలనే వంతెనపై అమర్చారు. ఈ వంతెన పొడవు 21.8 కి.మీ. కాగా, ఇందులో 16.5 కి.మీ.
అరేబియా సముద్రంపైన, మిగిలినది భూభాగంపై ఉంటుంది. ఈ వంతెనను రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. జంతువులను రవాణా చేసే వాహనాలను ఈ వంతెన మీదికి అనుమతించరు. అలాగే.. దీనిపై ప్రయాణించే వాహనాల వేగాన్ని గంటకు 100 కి.మీ గా నిర్ణయించారు. ఇది ముంబై- పుణె ఎక్స్ప్రెస్ వేను, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ప్రపంచంలో 10వ పొడవైన సముద్రపు వంతెనగా ఇది రికార్డుకెక్కింది. ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ టెక్నాలజీతో దేశంలో నిర్మించిన తొలి వంతెనగా ఇది గుర్తింపు పొందింది.
దీని నిర్మాణానికి వాడిన ఉక్కు బరువు.. 500 బోయింగ్ 747 విమానాల బరువుకు సమానం. మొత్తం 85000 టన్నుల ఆర్థోట్రోపిక్ స్టీల్ను ఇందులో వాడారు. దీని బరువు 17 ఈఫిల్ టవర్ల బరువుకు సమానం. దీని నిర్మాణానికి 9,75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వాడారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణంలో వాడిన కాంక్రీటు కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీతో బాటు పూణే, గోవాలకూ వేగంగా చేరేందుకు దోహదపడనుంది.