USA: ప్రపంచ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఎయిర్ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. దీనిని సెనేట్ ఆమోదిస్తే అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాజాచారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బృందంలో రాజా చారి కూడా ఉన్నారు. అంతరిక్షంలో 177 రోజులు ఉండి స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. నాసాలో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్ఫోర్సులో టెస్ట్ పైలట్గా ఉన్నారు.