Population: ప్రశ్న: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది?
జవాబు: చైనా.
రాంగ్ ఆన్సర్. నిన్నటి వరకూ ఇది రైట్ ఆన్సరే కావొచ్చు కానీ.. నేటితో సమాధానం మారిపోయింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ తొలిస్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లు. ఇక, చైనా 142.57 కోట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. అంటే, చైనా కంటే మన దగ్గర సుమారు 29 లక్షల జనాభా ఎక్కువ. ఆ మేరకు ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరుతో లేటెస్ట్ డేటాను ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం విడుదల చేసింది. ఇక అమెరికా కేవలం 34 కోట్ల మందితో మూడోస్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ జనాభా 804.5 కోట్లు. అందులో మూడోవంతు ఇండియా, చైనాలోనే ఉన్నారు.
వరల్డ్ నెంబర్ వన్ ఇండియా అంటూ గొప్పగా చెప్పుకునే విషయమేమీ కాదిది. ఒక రకంగా గుడ్న్యూసే అయినా, అనేక విధాలుగా ఇది నెగటివ్ వార్తనే.
కొన్ని దశాబ్దాలుగా డ్రాగన్ కంట్రీ పాపులేషన్లో టాప్ ప్లేస్లో ఉండేది. కష్టపడి, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి.. బలవంతంగా ఆ దేశ జనాభాను తగ్గించుకుంది. ‘వన్ ఆర్ నన్’.. స్లోగన్ చైనాదే. పక్కదేశం తనకు తాను జనాభా తగ్గించుకుని.. మనల్ని నెంబర్ వన్ స్థానంలోకి తీసుకొచ్చింది.
భారత్లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్నార్ అన్నారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.
నిజమే, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న యువశక్తి మన సొంతం. యువ జనాభా వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. చైనా, జపాన్ లాంటి దేశాలు బలవంతంగా జనాభాను తగ్గించుకోవడం వల్ల.. ఇప్పుడు ఆయా దేశాల్లో యువత సంఖ్య భారీగా పడిపోయింది. వృద్ధుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇది ఆయా దేశాల శ్రమశక్తి, జీడీపీ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. భారత్కు అలాంటి ప్రమాదం లేదు. అత్యధిక జనాభా ఉండటం మన దేశానికి అదనపు బలంగా మారుతోంది. ప్రపంచ మార్కెట్లన్నీ మనవైపే చూస్తున్నాయి. జనాభాలో నెంబర్ 1గా మారడం వల్ల ఇండియాకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా.. దీర్ఘకాలం పాటు మనమే టాప్లో ఉంటే మాత్రం దేశాభివృద్ధికి ప్రమాదమే అంటున్నారు.