Pakistan Election 2024 Results:
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. గురువారం బాంబు పేలుళ్లు, భారీ హింస మధ్య ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన పార్టీ.. పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI) పార్టీపై, ఆ పార్టీ గుర్తు బ్యాట్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. పాకిస్థాన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ముందంజలో ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలా స్థానాల్లో స్వతంత్రులే ఊహించని విజయాలు సాధిస్తున్నట్లు పేర్కొంది.
కాగా.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీతో పాటు నాలుగు ప్రావిన్సుల శాసనసభలకు గురువారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా బాంబు పేలుళ్లు, భారీ హింస చోటుచేసుకుంది. ఈ ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ పూర్తయిన 11 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఫలితంలో పీటీఐ అభ్యర్థి విజయం సాధించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అక్కడ ముగ్గురు పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలుస్తోంది.
Read More : ‘భారత్ తెలివిగా వ్యవహరిస్తోంది’.. ఇండియాపై హేలీ సంచలన వ్యాఖ్యలు..!
ఇమ్రాన్ ఖాన్ జైల్ లో ఉండటంతో.. మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)పార్టీ అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ.. అనూహ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులే గెలుస్తుండటంతో.. పాకిస్థాన్ తదుపరి ప్రధాని ఎవరు అవుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నేటి మధ్యాహ్నానికి పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఎన్నికలకు ఒకరోజు ముందు.. బుధవారం బలూచిస్థాన్ లో జరిగిన ఉగ్రదాడితో పాక్ ఉలిక్కి పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా.. పోలింగ్ సమయంలో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. పీపీపీ సహా పలు రాజకీయ పార్టీలు మాత్రం.. రిగ్గింగ్ కోసమే ఈ సేవల్ని నిలిపివేశారని ఆరోపించాయి. పోలింగ్ సమయంలోనూ భారీగా హింస చెలరేగింది. చాలా ప్రాంతాల్లో సాయుధ మూకలు దాడులు చేశాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్, ఇతర ప్రావిన్సుల్లో జరిగిన దాడులలో 10 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో ఇద్దరు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు.