Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్లు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్షపడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం(Cipher Case) కేసులో.. ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు శిక్షను ఖరారు చేసింది.
అయితే.. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. ఆ వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన ఉన్నారు. పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబరులో సైఫర్ కేసులో.. ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైస్ జైల్లోనే విచారణ చేశారు. తాజాగా ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీలకు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.