Elon musk: కాంట్రవర్సీకి కేరాఫ్గా ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ట్విటర్ కొనుగోలు తర్వాత ఎప్పుడు ఏదో ఒక టాపిక్ పై స్పందిస్తూ… వివాదాస్పదం అవుతున్న మస్క్ ఈ సారి కొవిడ్ వ్యాక్సిన్ పై సంచలన ట్వీట్ చేశారు. బూస్టర్ డోస్ వేసుకున్న తర్వాత తాను పడిన బాధను ట్విటర్ లో రాసుకొచ్చారు.
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని.. ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మస్క్ చేసిన ట్వీట్ పెనుదుమారం రేపుతోంది. కొవిడ్ రెండో బూస్టర్ డోసు వేయించుకున్న తర్వాత తనకు చనిపోవాలన్నంత బాధ అనిపించిందని ఎలాన్మస్క్ అన్నారు. మొదటి డోస్ వేసుకున్న సమయంలో అంతగా ఇబ్బందిపడలేదు కానీ.. రెండో డోస్ తర్వాత నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. ఈ ప్రభావం తనపై చాలా రోజుల వరకు ఉందని.. క్రమ క్రమంగా దాని నుంచి తేరుకున్నానని తెలిపారు.
జర్మనీలోని టెస్లా ఫ్యాక్టరీకి సందర్శనకు వెళ్తున్న సమయంలో రెండో డోసు వేసుకోవాల్సి అవసరం ఏర్పడిందని మస్క్ చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత భరించలేని స్థాయిలో కండరాల నొప్పులు.. శరీరంపై మంటలతో ఇబ్బంది పడ్డానని.. ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితికి తనకు ఒక్కడికే కాదని.. బంధువైన మరో యువకుడు కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆస్పత్రి పాలయ్యాడని చెప్పాడు.
మొదటగా చిన్నపాటి జలుబు చేసినట్లనిపించింది. నయం అయిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాను. అప్పుడు ఎలాంటి ఇబ్బందికి గురవలేదు. చేతిపై కొంచెం దురదపెట్టి తగ్గిపోయింది. ఇటీవలే MRNA వ్యాక్సిన్ వేసుకున్నాను. ఇది మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసిందంటూ.. తాను పడిన బాధను మస్క్ ట్విటర్ లో రాసుకొచ్చారు.