Houthi Rebels in Red sea | ఎర్ర సముద్రలో పరిస్థితులు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. హమాస్ కు సపోర్ట్ గా హౌతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న దేశాల నౌకలే టార్గెట్ గా డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ దాడులు చేస్తుండడంతో చాలా వరకు షిప్పింగ్ కంపెనీలు సూయజ్ కెనాల్ రూట్ ను కాకుండా ఆఫ్రికా మొత్తం చుట్టి వస్తున్నాయి. దూరభారాలు పెరుగుతున్నా ఎటాక్స్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారు. ఏ చిన్న ఎటాక్ జరిగినా మొత్తం సరుకంతా సముద్రం పాలవుతుందన్న భయంతో రూట్ మార్చేస్తున్నారు.
Houthi Rebels in Red sea | ఎర్ర సముద్రలో పరిస్థితులు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. హమాస్ కు సపోర్ట్ గా హౌతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న దేశాల నౌకలే టార్గెట్ గా డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ దాడులు చేస్తుండడంతో చాలా వరకు షిప్పింగ్ కంపెనీలు సూయజ్ కెనాల్ రూట్ ను కాకుండా ఆఫ్రికా మొత్తం చుట్టి వస్తున్నాయి. దూరభారాలు పెరుగుతున్నా ఎటాక్స్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారు. ఏ చిన్న ఎటాక్ జరిగినా మొత్తం సరుకంతా సముద్రం పాలవుతుందన్న భయంతో రూట్ మార్చేస్తున్నారు.
ఎర్ర సముద్రంలో అలజడి పెరుగుతోంది. వాణిజ్య నౌకలు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నారు. డ్రోన్ ఎటాక్స్ కు దిగుతున్నారు. మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. షిప్పింగ్ కంపెనీలను భయపెట్టిస్తున్నారు… యూరప్ నుంచి ఆసియా దేశాలకు వెళ్లే షిప్పులనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న దేశాల నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు.
ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి.. యూరప్ దేశాల నుంచి భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు నౌకలు వెళ్తున్న మార్గమిది. సూయజ్ కెనాల్ తవ్విన తర్వాత కమర్షియల్ షిప్స్ ఆసియా దేశాలకు వెళ్లాలన్నా.. ఇక్కడి నుంచి యూరప్ వెళ్లేందుకు చాలా దూరం తగ్గింది. అంతకు ముందైతే… ఆఫ్రికాను చుట్టి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ వార్ తో మళ్లీ వాణిజ్య నౌకలు పాత రూట్ నే నమ్ముకుంటున్నాయి. హమాస్ కు సపోర్ట్ గా హౌతీ రెబల్ గ్రూప్ దూకుడు పెంచింది. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్న దేశాల నౌకలను టార్గెట్ చేసుకుంటుండడంతో చాలా వరకు షిప్పింగ్ కంపెనీలు.. తమ నౌకలను సూయజ్ కెనాల్ రూట్ కాకుండా ఆఫ్రికాను చుట్టి వెళ్లేలా మళ్లించుకుంటున్నాయి.
హౌతీ దాడులతో అలర్ట్ అవుతున్న షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. బాబ్ ఎల్-మండెప్ రూట్ లో నౌకలను తిప్పబోమని ప్రకటించాయి. ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు ట్రాన్స్ పోర్టేషన్ ను నిలిపేశాయి. బీపీ ఆయిల్ కంపెనీ కూడా రవాణాను ఆపేసింది. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం నౌకల ద్వారానే జరుగుతోంది. భారత్కు అది 95 శాతం. వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌక కావడంతో ఈ జల రవాణా ఎక్కువగా జరుగుతోంది.
దుస్తుల, కార్లు, చమురు, గ్యాస్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆహార ధాన్యాలు, ఇతర గూడ్స్ తరలించాలంటే ఈ సూజయ్ కెనాల్ రూట్ నౌకలే ఆధారం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక షిప్పింగ్ కాస్ట్ బాగా పెరిగింది. 40 ఫీట్ కంటైయినర్ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19 వేల షిప్స్ సూయెజ్ కెనాల్ రూట్ లో వెళ్తుంటాయి. దీంతో 30 రోజుల టైం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే ట్రాన్స్ పోర్ట్ ఖర్చు భారీగా పెరగడంతో పాటే సమయం కూడా చాలా వృథా అవుతుంది. ప్రస్తుతం హౌతీ దాడులతో బీమా కంపెనీలు కూడా ప్రీమియం పెంచేశాయి. ఈ భారం ఫైనల్ గా జనంపైనే పడుతోంది.
హౌతీ గ్రూప్ దాడులు ఒక్క ఎర్ర సముద్రం పరిధికే పరిమితం కావడం లేదు. తాజాగా అరేబియా సముద్రం దాకా డ్రోన్లు, మిసైల్ ఎటాక్స్ పెరుగుతున్నాయి. తాజాగా భారత తీరంలోనూ ఓ నౌకపై ఎటాక్ జరిగింది. ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం రెడ్ సీ. ఈజిప్టులోని సూయెజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది చాలా దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. అయితే రెడ్ సీ పరిధిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
నౌకా రవాణా రంగంలో హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి మలక్కా, హోర్ముజ్, బాబ్ ఎల్-మండెప్ జల సంధులు అత్యంత కీలకమైనవి. ప్రపంచంలోని 40 శాతం ఆయిల్ ఈ 3 జలసంధుల మీదుగానే వెళ్తుంది. ఈ రూట్ లకు అడ్డంకులు సృష్టించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారుతోంది. మరోవైపు భారత్ కు ఈ హౌతీ దాడుల ఎఫెక్ట్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య యూరప్ కు… నౌకల ద్వారా భారత్ సరకు రవాణా చేస్తోంది. దీనికి ఎర్ర సముద్రం రూట్ వాడుతోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే ఎక్కువగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం ఇండియన్లే. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వాణిజ్య నౌకలకు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు యుద్ధంతో హౌతీ రెబల్స్ ప్రమాదకరంగా మారారు.
హమాస్ కు మద్దతుగా అంటూ హౌతీ రెబల్స్ సడెన్ గా తెరపైకి వచ్చారు. యెమెన్లోని హౌతీ రెబల్స్కు ఇరాన్ నుంచి భారీగా వెపన్స్, డబ్బు సమకూరుతున్నాయి. అందులో డ్రోన్లు, యాంటీ షిప్, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైనా దాడులు చేయగల ఆయుధాలు రెబల్స్కు అందుతున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా మరింత కాలం సరకు రవాణాకు ఆటంకం కలిగితే యూరప్ లో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో ఐదో వంతు పెట్రోలియమే. రెండు వైపులా రోజుకు 9 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ఇలా ఈ రూట్ లో దాడులు పెరిగితే.. 2024లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది.
జైదీ షియాలు, హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో 1990లో యెమెన్ కేంద్రంగా హౌతీ గ్రూపు ఏర్పాటైంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. ఇరాన్తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్కు సపోర్ట్ గా ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్రూప్ కు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెప్పై హౌతీ రెబల్స్కు ఆధిపత్యం ఉంది. 2014 నుంచి యెమెన్లోని సైనిక ప్రభుత్వంతో ఈ గ్రూపు పోరాడుతూనే ఉంది. ఇప్పుడు వీరి నుంచి నౌకలు తప్పించుకోవడం పెద్ద సవాల్ గా మారింది. కొన్ని తృటిలో తప్పించుకున్నాయి. ఇంకొన్ని ఎటాక్ కు గురవుతున్నాయి.