Christian Oliver : ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా చనిపోయారు. తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు ఒలివర్ బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం బెక్వియాలో టేకాఫ్ తీసుకున్న తర్వాత ఊహించని రీతిలో కరీబియన్ సముద్రంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈఘటనలో ఒలివర్తోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు…. మడిత, అన్నీక్ ప్రాణాలు కోల్పోయారు. అలానే పైలట్ కూడా చనిపోయాడని అధికారులు వెల్లడించారు.
విమానం సముద్రంలో కూలిన సమాచారం అందగానే కోస్ట్గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాసేపటికే నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదాన్ని ఆ ఐల్యాండ్లో ఉన్న మత్స్యకారులు తొలుత గుర్తించారు. చూసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని విమానంలోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. ప్లెయిన్ క్రాష్కు గల కారణలపై పోలీసులు విచారణ చేపట్టారు.
వెస్ట్ జర్మనీలో పుట్టి పెరిగిన క్రిస్టియన్ ఒలివర్ నటుడు కావాలనే కలతో అమెరికాలో అడుగుపెట్టాడు. మోడల్గా కెరీర్ను స్టార్ట్ చేసి లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ లో నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంగ్లీష్లోనే కాకుండా జర్మన్ టీవీ సిరీస్ల్లో కూడా నటించాడు. 51 ఏళ్ల ఒలివర్ తన కెరీర్లో 60కి పైగా సినిమాలు, టీవీ సిరీస్ లలో నటించారు. 1994లో నటుడిగా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ముందుగా టీవీ సిరీస్లతో తన కెరీర్ను ప్రారంభించాడు. సేవ్డ్ బై ది బెల్ – ది న్యూ క్లాస్ అనే టీవీ సిరీస్ నటుడిగా క్రిస్టియన్ ఒలివర్కు మంచి పేరు తీసుకురావడంతో పాటు మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.
ది బేబి సిట్టర్స్ క్లబ్ అనే సినిమాతో క్రిస్టియన్ ఒలివర్ వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ నటించిన వాల్కరీ మూవీలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్లతో బిజీ అయ్యాడు. పాపులర్ షో అలారమ్ ఫర్ కోబ్రా-11లో ఒలివర్ రెండు సీజన్లలో నటించాడు. క్రిస్టియన్ ఒలివర్ చివరిగా ‘హంటర్స్’ సిరీస్లో నటించాడు. గతేడాది రిలీజైనా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి వాయిస్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అనుకోని రీతిలో ఒలివర్ మృతి చెందడంపై.. హాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.