Hijack Ship : యెమెన్ రెబెల్స్ హౌతీలు హైజాక్ చేసిన రవాణా నౌక గేలక్సీ లీడర్ ఇప్పుడో పెద్ద టూరిస్ట్ ఎట్రాక్షన్గా మారిపోయింది. ట్రిప్పునకు డాలర్ చొప్పున వసూలు చేస్తూ.. ఆ నౌకను సందర్శించేందుకు స్థానికులను హౌతీలు అనుమతిస్తు న్నారు. అయితే పురుషులకు మాత్రమే ఇందులోకి ప్రవేశించే వీలుంది. ఆ మేరకు నిబంధనను కూడా హౌతీలు విధించారండోయ్.
ఈ కార్ క్యారియర్ను దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీలు నిరుడు నవంబర్ 19న హైజాక్ చేశారు. ఆ నౌక సిబ్బంది 22 మంది కూడా ఇప్పటికీ మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా తాము చేస్తున్న పోరాటంలో తమకు దక్కిన ట్రోఫీగా గేలక్సీ లీడర్ను హౌతీలు భావిస్తుంటారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడులకు దిగిన కొద్ది కాలానికే ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు తమ దాడులను ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇజ్రాయెల్ వెళ్లే నౌకలను టార్గెట్ చేసుకున్నారు.
హౌతీలు స్వాధీనం చేసుకున్న ఆ నౌకపై ఇప్పుడు యెమెనీ జెండాలు ఎగురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ రాసిన స్లోగన్లు కూడా కనిపిస్తున్నాయి. పది మంది చొప్పున బృందాల వారీగా విజిటర్లను అనుమతిస్తున్నారు. బ్రిటన్కు చెందిన గేలక్సీ లీడర్ నిర్వహణ బాధ్యతలను జపాన్ సంస్థ చూస్తోంది. దాని యజమాని మాత్రం ఇజ్రాయెల్కు చెందిన వాణిజ్యవేత్త.
రెడ్ సీ తీరంలోని హొడైడా వద్ద లంగరేసిన ఆ నౌకలో టూరిస్టులు గంట నుంచి 5 గంటల పాటు విహరిస్తున్నట్టు తెలుస్తోంది. బందీలైన నౌకాసిబ్బందిలో బల్గేరియా, ఫిలిప్పినో, ఉక్రెయిన్, మెక్సికోకు చెందిన వారున్నారు. అయితే వారిని తాము చూడలేదని కొందరు విజిటర్లు చెబుతున్నారు.