Pakistan : తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాకిస్థాన్ అల్లాడుతోంది. ఆ దేశంలో ఆహార ధాన్యాలు నిండుకున్నాయి. ప్రస్తుతం 40 శాతం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇలాంటి స్థితిలో ఉన్న దాయాది దేశానికి ఓ భారత నౌక ద్వారా సాయం అందింది. ఆ నౌక రష్యా నుంచి 50,000 మెట్రిక్ టన్నుల గోధుములను సరఫరా చేసింది.
రష్యా నుంచి 4.5 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకొనేందుకు పాక్ కన్సైన్మెంట్ కుదుర్చుకొంది. దీంతో గ్లోబల్ మార్కెటింగ్ సిస్టమ్స్ ఐఎన్ఎసీ కంపెనీకి చెందిన ఎంవీ లీలా చెన్నై అనే నౌక 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను రష్యాలోని నోవొరోసిస్క్ ఓడరేవు నుంచి పాకిస్థాన్లోని గ్వాదర్ నౌకాశ్రాయానికి చేర్చింది.
జీఎంఎస్ సంస్థను డాక్టర్ అనిల్ శర్మ అనే గుజరాతీ వ్యాపారవేత్త నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నాయి. అనిల్ శర్మ వ్యాపార నిర్వహణలో డాక్టరేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని ఓ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా 10 ఏళ్లపాటు సేవలు అందించారు. ఆ కెరీర్ కు గుడ్ బై చెప్పి 1992లో జీఎంఎస్ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత గ్లోబల్ షిప్పింగ్ రీసైక్లింగ్లో అగ్రస్థానానికి జీఎంఎస్ చేరుకొంది. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 40 నౌకలు ఉన్నాయి. షిప్టెక్ 2022 సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డును అనిల్ శర్మ అందుకున్నారు.
1990ల్లో అమెరికా నేవీకి చెందిన నౌకలను యూఎస్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా విక్రయించేది. కానీ ఆ టెండర్లలో పాల్గొనేందుకు విదేశీయులకు అవకాశం లేదు. దీంతో అనిల్ శర్మ తొలుత ఆ నౌకలను కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని భారత వ్యాపారులకు విక్రయించేవారు. దీంతో అమెరికాలోని మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్లో జీఎంఎస్ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. మరోవైపు రష్యా వద్ద అదనంగా ఉన్న నౌకలను వదిలించుకోవడానికి కూడా జీఎంఎస్ సహాయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల నౌకల రీసైక్లింగ్ కు ఈ సంస్థ సహకరించింది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఆ సంస్థకు చెందిన నౌక ద్వారా గోధుముల సరఫరా జరిగింది.