పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై చేసిన దాడికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో ఇజ్రాయెల్ మిలిటరీ సైట్ పై హమాస్ సభ్యులు దాడి చేస్తుందని హమాస్ పేర్కొంది. కిస్సుఫిమ్ బెటాలియన్ కు చెందిన సాయుధ మద్దతు సైట్ పై హమాస్ తీవ్రవాదులు దాడులు చేశారు. అలాగే ఖాన్ యునిస్ కు తూర్పున ఉన్న సైనిక శిబిరంలో ఉన్న కొందరు ఇజ్రాయెల్ లు చంపబడగా.. మరికొందరిని బంధించారు. ఇజ్రాయెల్ పై తాము చేసిన దాడి.. అల్ అక్సా ఫ్లడ్ ఆపరేషన్ లో భాగమని హమాస్ పేర్కొంది.
కాగా.. గాజాను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. గాజా స్ట్రిప్ సరిహద్దు తమ ఆధీనంలోనే ఉందని ఇటీవలే ప్రకటించిన సైన్యం.. హమాస్ వద్ద ఇజ్రాయెల్ పౌరులు బంధీలుగా ఉన్నప్పటికీ.. గాజాను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నుఖ్బా ఫోర్స్ పై వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. గాజాలో ఉన్న హమాస్ స్థావరాలపై సైన్యం రాకెట్లతో దాడి చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు దిగిన హమాస్ ను ఎప్పటికైనా నేలమట్టం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను బలితీసుకున్న హమాస్ ను విడిచిపెట్టబోమన్నారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ – పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు.. పాలస్తీనాకు చెందిన 1000 మంది పౌరులు కూడా మరణించారు. దీనిని హమాస్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని పాలస్తీనా ప్రజలకు పిలుపునిచ్చింది. వెస్ట్ బ్యాంక్ లో ఉండే ప్రజలంతా శుక్రవారం ఈస్ట్ జెరూసలెంలోని అల్-అక్సా మసీదు వరకూ ర్యాలీగా వచ్చి.. వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని కోరింది. అక్కడ ముస్లింలకు పవిత్రమైన ప్రాంతాల్లో అల్-అక్సా మసీదు కూడా ఒకటి. ప్రతి శుక్రవారం ఈ మసీదుకు భారీ సంఖ్యలో ముస్లింలు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.