Hamas chief Ismail Haniyeh killed(Latest world news): హమాస్ పై తొమ్మిది నెలలుగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఓ విధంగా ఈ యుద్ధంలో విజయం సాధించేసింది. హమాస్ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఇస్మాయిల్ హానియె మరణించాడు. ఇరాన్ రాజధాని తెహ్రాన్ లో అయన నివాసంపై మంగళవారం ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో హానియెతో పాటు ఆయన ఇరానీ బాడీగార్డ్ కూడా మృతి చెందినట్లు హమాస్ అధికార ప్రతినిధి బుధవారం ప్రకటించారు.
”తెహ్రాన్ లోని ఇస్మాయిల్ హానియె నివాసంపై ద్రోహులైన జయోనిస్టులు (అతివాద యూదులు) దాడి చేశారు. ఈ దాడిలో మా సోదరుడు, హమాస్ అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు ముజాహిద్ ఇస్మాయిల్ హానియె అమరులయ్యారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన తరువాత ఆయన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ దాడి జరిగింది. ” అని హమాస్ ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని ఇరాన్ ప్రత్యేక సైన్య దళం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ధృవీకరించింది. ఈ దాడిలో హానియెకు బాడీగార్డ్ గా ఉన్న ఇరాన్ కమాండో కూడా చనిపోయారని తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇరాన్ అధికారులు వెల్లడించలేదు. ఇప్పటివరకు ఇస్మాయెల్ హానియెపై దాడి తామే చేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
కతార్ దేశంలో నివసిస్తున్న హానియె, ఇరాన్ కొత్త అధ్యక్షుడరు మసూద్ పజేష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఇరాన్ వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్లిన కొద్దిసేపటికే జరిగిన దాడిలో ఆయన మరణించాడు. ఇస్మాయిల్ హానియె ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ అని అమెరికా ప్రకటించింది.
గత ఏప్రిల్ నెలలో హానియె ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు ఇజ్రాయెల్ బాంబు దాడిలో చనిపోయారు. వారంతా గాజాలోని అల్ షతి క్యాంపులో ఒక కారులో వెళుతుండగా.. ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేయగా.. మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
జూన్ నెలలో హానియె కుటుంబంలోని పది మంది చనిపోయారు. వీరిలో ఒకరు ఆయన సోదరి. వీరంతా గాజాలో నివసిస్తుండగా.. ఇజ్రాయెల్ రాకెట్ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ లో నివసిస్తున్న హానియె మరో సోదరిని ఇజ్రాయెల్ సైన్యం ఏప్రిల్ నెలలో అరెస్టు చేసింది.
62 ఏళ్ల ఇస్మాయిల్ హానియె 1962లో ఈజిప్ట్ ఆక్రమిత పాలస్తీనాలోని గాజా శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1987లో ఆయన గాజా ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి.. హమాస్ లో చేరారు. క్రమంగా 2007లో జరిగిన పాలస్తీనా ఎన్నికల్లో ఆయన విజయం సాధించి పాలస్తీనా ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. అయితే ఆయన ఎన్నికలు చెల్లవంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయినా హానియె ఆయన ఆదేశాలు లెక్కచేయకుండా గాజాను పారిపాలించేవారు.
Also Read: ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..