274 Died in Gaza: సెంట్రల్ గాజాలోని హమాస్ చెరలో బందీలుగా చిక్కిన నలుగురి కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడిలో 700మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే తొలుత ఈ ఆపరేషన్లో 100మంది చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొనగా.. ప్రస్తుతం 274కు చేరిందని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. ఈ దాడిలో గాయపడిన బాధితుల అర్తనాదాలతో అల్ అఖ్సా ఆస్పత్రి నిండిపోయిందని వార్తలు వెలువడ్డాయి. గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడిచేయడంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లడంతో ఇజ్రాయెల్పై విమర్శలు వస్తున్నాయి. కాగా, బందీలను రక్షించే క్రమంలో జరిగిన దాడుల్లో ఓ అధికారి మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారి తెలిపారు.
మెరుపు దాడి..
సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున్న దాడి చేసింది. బందీలు రెండు వేర్వేరు అపార్ట్మెంట్లో ఉంచడంతో ఒకేసారి రెండు భవనాల్లోకి బలగాలు ప్రవేశించి మెరుపు దాడి చేశారు. వీటి మధ్య దాదాపు 200 మీటర్ల దూరం ఉంది. కాగా, రాకెట్ గ్రనేడ్లు ప్రయోగించడంతో ఆ పరిసర ప్రాంతాలు నెత్తురు ఏరులా పారింది. వెంటనే బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతిచర్యలు తీసుకున్నారు. అయితే గతేడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో 250మందికిపైగా కిడ్నాప్ చేసి గాజాకు తరలించి.. తర్వా త కొంతమందిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే తరహాలో ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో ఇద్దరు బందీలను కాపాడే క్రమంలో 74 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
Alao Read: బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. కాల్వ ఒడ్డున ఎముకలు లభ్యం!
పాలస్తీనాకు విముక్తి కలగాలి
పాలస్తీనాకు విముక్తి కలిగించాలని, ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయం నిలిపివేయాలని పాలస్తీనా మద్దతుదారులు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని చుట్టుముట్టారు. దీంతో శ్వేత సౌధ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగించాలని ఆందోళన చేశారు. ఈ నిరసనలొ 35వేల మంది పాలస్తీనా మద్దతుదారులు పాల్గొన్నారు. కాగా, హమాస్ చెరలో ఎనిమిది నెలలుగా మగ్గుతున్న నలుగురు ఇజ్రాయెల్ పౌరుల కోసం చేపట్టిన ఆపరేషన్ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరో ప్రాణాలను ఫణంగా పెట్టడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంతోపాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. ఈ ఆపరేషన్లో విడుదలైన బందీలు నోవా అర్గామని(25), అల్మోగ్ మైర్ జాన్(21), ఆండ్రీ కోజ్ లోవ్(27), ష్లామీ జీవ్(40) తిరిగి తమ కుటుంబాలను కలుసుకున్నారు.