Layoffs: ఐటీ రంగాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ముఖ్యంగా రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్ , ప్రొడక్ట్స్ టీమ్లలో ఎక్కువగా కోతలు ఉంటాయని చెప్పారు. అమెరికాలో పనిచేస్తున్న సిబ్బందిపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఈమేరకు ఉద్యోగులకు సుందర్ పిచాయ్ మెయిల్ పంపించారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని మెయిల్లో పేర్కొన్నారు.
ఉద్యోగం కోల్పోయిన వారు తదుపరి ఉపాధి చూసుకునేందుకు సాయం అందిస్తామని స్పష్టం చేశారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్లో పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు వివరించారు.