Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అట్టుడుకుతోంది. నిత్యావసర ధరలు పెరిగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంక కంటే దారుణంగా మారుతోంది పాకిస్థాన్. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న తమ ఎంబసీ ఆస్తులను వేళానికి పెట్టింది.
ఇక పాలు, ఇంధన ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 280కి చేరింది. అది కూడా సరిపడినంత అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరింది. దీంతో అక్కడి జనాలు బంగారం కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.
ప్రస్తుతం పాక్లో ద్రవ్యోల్బణం 50 సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరింది. మరోవైపు ఫారెక్స్ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర ఔషధాలు, ఇతర మెడిసిన్ ముడిసరుకు దిగుమతి చేసుకోలేక పాక్ సర్కార్ తీవ్ర ఇబ్బందులుపడుతోంది. మరోవైపు సరైన సమయానికి మందులు అందక ఆసుపత్రుల్లో రోగులు అవస్తలు పడుతున్నారు.