Gaza−Israel Conflict : ఇప్పుడు మీరు చూడబోయేది యుద్ధం 2.0. ఒకవైపు ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది.అది దండయాత్రగానే కనిపిస్తున్నా నేటి తరం చూస్తున్న యుద్ధమది. ఇప్పుడు మరోచోట దారుణ మారణహోమం మొదలైంది. ఇజ్రాయెల్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి వార్గా మారింది. యుద్ధంలో ఉన్నామంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అందుకే..ఇది యుద్ధం 2.0
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం మరణ మృదంగం మోగిస్తోంది. ఉరుముల్లేని పిడుగుల్లా ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. సరిహద్దు కంచెలను తెంచుకుని సాయుధులు చొరబడ్డారు. ఆకాశం నుంచి పారాగ్లైడర్ల సాయంతో దండెత్తారు. సముద్ర మార్గం నుంచి బోట్లలో దూసుకొచ్చారు. ఏం జరుగుతోందో ఇజ్రాయెల్కు అర్థమయ్యేలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. ఇప్పటి వరకూ 500 మందికి పైగా పాలస్తీయన్లు చనిపోగా.. మరో 1700 మంది గాయపడ్డారు. ఆస్పత్రులు నిండిపోయాయి. 100 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎటుచూసినా కాల్పుల మోతలు, బాధితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి.
పాలస్తీనాలోని గాజాపై ప్రతీకార దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. వైమానిక దాడులను కంటిన్యూ చేస్తోంది. ఈ దాడుల్లో పాలస్తీనాకు చెందిన 250 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2వేల మంది గాయపడ్డారు. తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడంతో ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇజ్రాయెల్పై దాడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇంగ్లండ్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఖండించారు.
ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో ఆ దేశానికి ఎయిర్ ఇండియా సంస్థ విమానాల రాకపోకలు నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్కు బయల్దేరే విమానాలను రద్దు చేసింది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు గాజా ప్రాంత వాసులు అక్కడి నుంచి పారిపోవాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేశారు. హమాస్ స్థావరాలపై దాడులు కొనసాగించి, ప్రతి హమాస్ భూమిని శిథిలం చేస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు.