G7 Summit: ఇటలీలోని అపులియాలో జీ7 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సు జూన్ 13నుంచి 15వరకు జరగనుంది. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలు ఉన్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీతోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సైతం వెళ్లారు. అయితే ఈ సదస్సులో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ దేశానికి జీ7 దేశాలు అండగా నిలిచాయి. ఈ మేరకు ఆ దేశానికి మరింత అండగా నిలిచేందుకు రూ.4.17 లక్షలు కోట్లు అంటే సుమారు 5వేల కోట్ల డాలర్లు రుణ సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాయి.
కీలక పరిణామం
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. అయితే ఈ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ దేశాల్లో నిలిచిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ తదితర నిధులను సమకూర్చాలని జీ 7 దేశాలు తీర్మానించుకున్నాయి. రష్యా దేశంపై ఆంక్షలు కొనసాగుతున్నందున పలు దేశాల్లో సుమారు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆస్తులు నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువగా ఐరోపా దేశాలకు సంబంధించిన ఆస్తులు ఉండడం విశేషం.
ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆస్తుల నుంచి నిధులను ఎలాగైనా సమకూర్చాలన్న విషయంపై జీ 7 దేశాలు చర్చించాయి. అయితే నిలిచిన ఆస్తులను తొలగించొద్దని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా తొలి విడ నిధులు ఉక్రెయిన్కు అందనున్నాయి. దీనిపై శుక్రవారం సంయుక్త ప్రకటన రానుంది. ఉక్రెయిన్కు సొంతంగా రూ.31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బిట్రన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించిడం గమనార్హం.
ఇటలీకి వెళ్లిన మోదీ
ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరారు. ఈ సదస్సులో భారత్ ప్రధానంగా కృత్రిమ మేధ(ఏఐ), ఎన్జరీ, ఆఫ్రికా, మెడిటెర్రేనియన్పై దృష్టి సారిస్తుందని మోదీ చెప్పనున్నారు. శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోపాటు వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ
సమావేశమయ్యే అవకాశం ఉంది.
Share