Philip Island : అస్ట్రేలియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న ఫిలిప్ దీవిలో మునిగి నలుగురు భారతీయులు మృతి చెందినట్టు కాన్బెర్రాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరణించిన వారిలో ముగ్గురు మహిళలే ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది.
ఈ నెల 24న నలుగురు వ్యక్తులు దీవిలో ముగినినట్టు సమాచారం రాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ వారిని బయటకు తీశారు. ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20ఏళ్ల యువతికి తీవ్ర గాయాలయ్యయి.
అనంతరం విమానంలో మెల్బోర్న్లోని ఆల్ఫ్రెడ్ ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమించి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఫారెస్టు గుహల సమీపంలో సెక్యూరిటీ లేని ప్రదేశంలో వీరంతా ఈత కొడుతుండగా ప్రమాదం జరిగినట్లు మీడియా పేర్కొంది. మెల్బోర్న్లోని కాన్సులేట్ జనరల్ బాధితుడి కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
అయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. మరణించిన వారిలో ఒకరు 43 ఏళ్ల మహిళ పంజాబ్లోని కపుర్తలా జిల్లా ఫగ్వారాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆమె విహారయాత్రకు ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లినట్టు సమాచారం. మిగిలిన ముగ్గురు మెల్బోర్న్కు సమీపంలో నివసిస్తున్నారని విక్టోరియా పోలీసు అధికారి కరెన్ నైహోల్మ్ తెలిపారు.
“ఆస్ట్రేలియాలో హృదయ విదారక విషాదం. ఫిలిప్ ద్వీపం, విక్టోరియాలో మునిగిపోయిన సంఘటనలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. @cgimelbourne బృందం అవసరమైన సహాయం కోసం మరణించిన వారి స్నేహితులతో సంప్రదింపులు జరుపుతోంది” అని రాయబార కార్యాలయం ట్వీట్ ద్వారా తెలిపింది.
ఫిలిప్ ద్వీపం.. సముద్ర గుహలకు ప్రసిద్ధి చెందింది. ఫారెస్ట్ గుహలు ప్రాణరక్షకులు లేని ప్రమాదకరమైన ఈత ప్రదేశాలకు స్థానికులలో ప్రసిద్ధి చెందిన పర్యాటక బీచ్. 2018లో కూడా ఇద్దరు భారతీయులు ఆస్ట్రేలియాలోని మూనీ బీచ్లో మునిగి చనిపోగా.. మరొకరు అదృశ్యమయ్యారు.