ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ (Trillionaire) గా నిలిచేదెవరు? అందుకు ఎంత సమయం పడుతుంది? బ్రిటన్కు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఆక్స్ఫామ్ ఈ అంశాలపై ఓ అంచనాకు వచ్చింది. జస్ట్.. పదేళ్లలోనే తొలి ట్రిలియనీర్ ఉద్భవిస్తారని తెలిపింది. 21 స్వతంత్ర స్వచ్ఛంద సంస్థలు కలిసి 1942లో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్(Oxfam International)ను నెలకొల్పాయి.
టాప్ ఫైవ్ బిలియనీర్ల ఆస్తుల మొత్తం 2020లో 405 బిలియన్ డాలర్లు ఉండగా.. నిరుడు 869 బిలియన్ డాలర్లకు చేరిందని ఆక్స్ఫామ్ వెల్లడించింది. అదే సమయంలో 500 కోట్ల మంది ఆర్థిక పరిస్థితులు దిగజారాయని పేర్కొంది. అంటే పేదలు మరింత పేదలుగా.. సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆర్థిక అసమానతలకు సంకేతంగా దీనిని భావించాల్సి ఉంటుందని ఆక్స్ఫామ్ చెప్పింది.
ప్రస్తుతం టాప్ బిలియనీర్లుగా తొలి ఐదు స్థానాలను టెస్లా(Tesla) సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) , బహుళ జాతి సంస్థ ఎల్వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్(Bernard Arnault), ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్(Larry Ellison), ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్(Warren Buffett), అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఆక్రమించారు. 2020 తర్వాత వీరి ఆస్తుల మొత్తం ఏకంగా 114% పెరిగాయి. ఆర్థిక అంతరాల దశాబ్దంలోకి ప్రపంచం ప్రవేశించినట్టు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోందని ఆక్స్ఫామ్ వివరించింది.
టాప్ ఫైవ్ బిలియనీర్ల సంపద రెట్టింపు అయిందని, అదే సమయంలో 500 కోట్ల మంది నిరుపేదలుగా మారారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బేహర్ వివరించారు. ఎవరైనా ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకోవడమంటే.. చమురు సంపన్న దేశం సౌదీఅరేబియా విలువకు సమానస్థాయిలో సంపదను పోగేసుకున్నట్టే లెక్క. స్టాండర్ట్ ఆయిల్ వ్యవస్థాపకుడు జాన్ డి రాక్ఫెల్లర్ 1916లో ప్రపంచ తొలి బిలియనీర్గా అవతరించినట్టు చెబుతారు.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఫోర్స్బ్ అంచనాల మేరకు అతని సంపద దాదాపు 250 బిలియన్ డాలర్లు. కొవిడ్ అనంతర కాలంలో 500 కోట్ల మంది పేదరికంలోకి జారారని, యుద్ధాల కారణంగా వారి జీవితాలు మరింత దుర్భరం కానున్నాయని ఆక్స్ఫామ్ ఆందోళన వెలిబుచ్చింది. ఉక్రెయిన్పై రష్యా దాడుల కారణంగా ఇంధనం, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం పేద దేశాలపై మరింతగా ఉందని తెలిపింది.