Mud Slides in China : ఆగ్నేయ చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగి పడటంతో ఇప్పటి వరకూ 11 మంది మరణించినట్లు అక్కడి మీడియా అధికారికంగా వెల్లడించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. హునన్ ప్రావిన్సులోని హెంగ్ యాంగ్ పరిధిలో ఉన్న యూలిన్ గ్రామంలో ఇంటిపై ఆదివారం ఉదయం మట్టిచరియలు విరిగిపడ్డాయి. 18 మంది అందులో చిక్కుకోగా.. వారిలో ఆరుగురిని రక్షించామని, మరో 11 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మరొకరి ఆచూకీ మిస్సైనట్లు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగానే మట్టిచరియలు విరిగిపడినట్లు తెలిపారు. చైనాలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా మరణాలు నమోదైనట్లు అక్కడి మీడియా పేర్కొంది. భారీవర్షాలకు షాంఘైలో ఓ భారీ వృక్షం కూలగా.. ఒక డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చైనాలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గేమి తుపాన బలహీనపడినా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్ లో 34 మంది మరణించగా.. తైవాన్ లో 10 మంది మృతిచెందారు.