Earthquake : ఇండోనేసియాలో సంభవించిన భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం వల్ల 13 వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఇండోనేసియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రధాన ద్వీపం జావాను సోమవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. భూకంప కేంద్రం చియాంజుర్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఇళ్లన్నీ కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. మృతిచెందిన వారిలో ఆ విద్యార్థులే అధికంగా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 700 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలా మందికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. చియాంజుర్ పరిసరాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం పెరిగింది.
జెడిల్ గ్రామంలో 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. దీని ప్రభావం చియాంజుర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని జకార్తాలోనూ కనిపించింది. అక్కడ అపార్టుమెంట్లు, కార్యాలయాలు కంపించాయి. ప్రజలు, ఉద్యోగులు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు తీశారు.
ఇండోనేసియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే జకార్తాలో ప్రకంపనల ప్రభావం అంతగా కనిపించదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జనవరిలో సులావేసిలో భూకంపం వల్ల 100 మంది మృత్యువాత పడ్డారు.