Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. కాగా.. భూకంప కేంద్రాన్ని 80 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
కాగా.. ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం రోజునే.. జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. గడిచిన 8 సంవత్సరాల్లో ఈ భూకంపమే అక్కడ తీవ్రమైనదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 100 మంది మరణించగా.. 200 మందికిపైగా ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. భూకంపం అనంతరం పలు తీరప్రాంతాల్లో సునామీ కూడా సంభవించింది.