EarthQuake: భూకంపం. భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.8 రీడింగ్. ఫలితం పలు నగరాల్లో వేలాది కట్టడాలు నేలమట్టం. కొన్ని గంటల వ్యవధిలో మరోసారి పెను ప్రళయం. ఈసారి రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత. మళ్లీ అదే స్థాయిలో విలయం. ఈ రెండు భూకంపాలు టర్కీ, సిరియాలను కుదిపేశాయి. ఏకంగా 1600 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. వేలాది మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో సంభవించిన అతిపెద్ద భూకంపమిది. అది మిగిల్చిన భారీ విషాదమిది.
భూకంప ధాటికి తుర్కియే( టర్కీ), సిరియా నగరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున భూమి తీవ్రంగా కంపించింది. భూకంప తీవ్రతకు సుమారు 3వేల భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తుర్కియేలోని గాజియాన్తెప్ ప్రాంతానికి 33 కి.మీ. దూరంలో 18 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప లేఖినిపై తీవ్రత 7.8 గా నమోదైంది. దియర్బకీర్, అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. తీవ్రమైన తొలి భూకంపం తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. మరింత మంది శిథిలాల్లో ఇరుక్కుపోయారు.
తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో ప్రజలకు తప్పించుకునే సమయం చిక్కలేదు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోవడంతో.. మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మధ్యాహ్నం మరోసారి భూకంపం విరుచుకుపడటంతో విషాదం మరింత పెరిగింది.
తుర్కియే, సిరియాల్లో భూకంప విలయంపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని.. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్స్, మెడికల్ సిబ్బంది, మందులను టర్కీకి పంపనుంది భారత్.