Dragon Country : చైనాలో పురుడు పోసుకున్న కరోనా మాట చెబితే ఇప్పటికీ వంట్లో వణుకుపుడుతుంది అంటే.. ఆ మహమ్మారి సృష్టించిన విలయతాండవం ఎలాంటిదో అర్థమైపోతుంది. ప్రపంచం ఏనాడూ కనివినీ ఎరుగని రీతిలో కోవిడ్ వైరస్ విజృంభణ యావత్ దునియానే సంక్షోభంలో పడేసింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటున్న సమయంలో.. అలాంటి ఓ వ్యాధి చైనా చిన్నారులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఈ అంతుచిక్కని న్యూమోనియాతో బుధవారం ఒక్కరోజే బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్మీడియాలో షేర్ చేసింది.
అంతుచిక్కని న్యూమోనియాతో ఒకేసారి వందలాది చిన్నారులు అనారోగ్యానికి గురికావడం ఆందోళన కలిగించే విషయని.. ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని తెలిపింది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే.. ఇది కోవిడ్ లాంటి మరో మహమ్మారిగా మారే అవకాశలపై ఇప్పడే క్లారిటీ ఇవ్వలేమని తెలిపింది. ఇటీవల కాలంలోనే చైనా కోవిడ్ నిబంధనలు ఎత్తివేసిందని.. అప్పటి నుంచి తరుచూ అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించారు సంస్థ ప్రతినిధులు. ఇక ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ వ్యాధిపై పూర్తి వివరాలు వెల్లడించాలని చైనాను ఆదేశించింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
.
.
.