Donald Trump Hit With Rs. 3 thousand crore Penalty: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా న్యూయార్క్ కోర్టు మరో షాకిచ్చింది. పలు బ్యాంకులను మోసం చేసినందుకు 364 మిలియన్ డాలర్లు అంటే రూ.3వేల కోట్ల జరిమాన చెల్లించాలని ఆదేశించారు.
డొనాల్డ్ ట్రంప్ తన ఆస్తులను ఎక్కువగా చూపించి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసం చేశారనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలు ఉన్నట్లు ట్రంప్పై కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేయగా దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ జరిపింది.
Read More: భారత్కు చమురు తెస్తున్న నౌకపై మిసైల్ దాడి..
ఇందులో ట్రంప్పై ఉన్న అభియోగాలు రుజువవ్వడంతో 365 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఫిబ్రవరి 6న తీర్పునిచ్చారు. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్కు చెందిన ఏ సంస్థలోనూ ట్రంప్ ఆఫీసర్గా లేదా డైరెక్టర్గా ఉండకూడదంటూ నిషేధం విధించారు. ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని పేర్కొంది. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
రెండోసారి వైట్హౌస్కు వెళ్లేందుకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్కు గత కొంతకాలంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో తనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించి పరువునష్టం కేసులో అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ (80)కు 83.3 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.692.4 కోట్లు అదనంగా చెల్లించాలని మాన్హటన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధించారు. 2022లో పన్ను చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో ట్రంప్కు 1.6 మిలియన్ డాలర్ల జరిమాన పడింది.