Presidential Debate: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనసు మార్చుకున్నారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్తో డిబేట్కు సై అన్నారు. ఆమెతో సంవాదానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఇది వరకే డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు, మొన్నటి వరకు డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్న జో బైడెన్తో డిబేట్ చేశాడు. సీఎన్ఎన్ నిర్వహించిన ఆ డిబేట్లో జో బైడెన్ చురుకుగా స్పందించలేదు. జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నదని, కదలికల్లోనూ చురుకుదనం లేదనే అభిప్రాయాన్ని డెమోక్రాట్లు వచ్చారు. ఆ తర్వాతే డెమోక్రాట్ల అభ్యర్థిగా జో బైడెన్ వద్దనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఆ తర్వాత అనివార్యంగా జో బైడెన్ తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ను అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.
ఇది వరకు కమలా హ్యారిస్ను, డొనాల్డ్ ట్రంప్ను ఓ చానెల్ తమ నెట్వర్క్లో డిబేట్కు రావాలని ఆహ్వానించింది. అందుకు కమలా హ్యారిస్ అంగీకారం తెలిపింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆమె డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ఇంకా ధ్రువీకరణ కాలేదని, ఆమెతో డిబేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆమెకు సొంత పార్టీలోనే ఆదరణ లేదని, బరాక్ ఒబామా కూడా ఆమెకు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. కానీ, ఆ తర్వాత ఒబామా దంపతులు ఆమెకు ఫోన్ చేసి ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.
Also Read: తాజ్ మహల్లో గంగాజలం సమర్పించిన వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్
అభ్యర్థిత్వానికి కావాల్సిన ఓట్లను సాధించుకున్న కమలా హ్యారిస్తో ఇప్పుడు డిబేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. తన ట్రుత్ సోషల్లో ఈ మేరకు ట్రంప్ పోస్టు పెట్టారు. ఫాక్స్ న్యూస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని వివరించారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో డిబేట్ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. సెప్టెంబర్ 4వ తేదీన డిబేట్ జరుగుతుందని పేర్కొన్నారు. ఏబీసీ చానెల్ వేదికగా డిబేట్ షెడ్యూలైందని, కానీ, జో బైడెన్ పాల్గొనలేని కారణంగా అది రద్దయిపోయిందని వివరించారు.
హ్యారిస్తో డిబేట్ సెప్టెంబర్ 4వ తేదీన గ్రేట్ కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియాలో జరుగుతుందని ట్రంప్ తెలిపారు. డిబేట్ మారేటర్లుగా బ్రెట్ బాయర్, మార్థా మెక్ కల్లం ఉంటారని వివరించారు. జో బైడెన్తో జరిగిన డిబేట్తో ఏ రూల్స్ ఉన్నాయో.. అవే రూల్స్ ఇందులోనూ ఉంటాయని చెప్పారు. అయితే, గత డిబేట్లో వీక్షకులు లేరని, ఈ డిబేట్ మాత్రం ఫుల్ ఆడియెన్స్ ముందర జరుగుతుందని పేర్కొన్నారు.