Dell: కరోనా సంక్షోభంలో అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఒక్క ఐటీ రంగం మాత్రం తట్టుకొని నిలబడింది. అలాంటిది ఇప్పుడు మాంద్యం దెబ్బకు విలవిలలాడుతోంది. ఆర్థిక నష్టాలతో దిగ్గజ కంపెనీలు సైతం దివాలా తీస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. ఇప్పుడు పీసీ తయారీ సంస్థ డెల్ టెక్నాలజీ వంతు వచ్చింది.
మొత్తం 6,650 మంది ఉద్యోగులను సాగనంపుతున్నట్లు డెల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇది తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమని తెలిపింది. ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.
కరోనా కాలంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయడం.. విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లు వినడంతో పీసీలకు డిమాండ్ పెరిగింది. దీంతో జోరుగా పీసీల విక్రయాలు జరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా తగ్గి పరిస్థితులు మెరుగుపడడంతో పీసీల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో పీసీ తయారీ కంపెనీలకు నష్టాలు తప్పడం లేదు.
డెల్ టెక్నాలజీస్కు మొత్తం ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. ప్రస్తుతం డెల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయాయి. దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.