Israel War Updates : గాజాలో మిలిటెంట్ గ్రూప్ హమాస్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ తరుణంలో పశ్చిమాసియా జలాల్లో వారం రోజులుగా ఆరు యుద్ధనౌకలు సంచరిస్తున్నాయని చైనా ప్రకటించింది. మే నెల నుంచే 44వ నేవల్ ఎస్కార్ట్ టాస్క్ఫోర్స్ ఈ ప్రాంతంలో ఆపరేషన్లను నిర్వహిస్తోందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.
ఒమన్ నేవీతో కలిసి గత వారం సంయుక్త విన్యాసాలు కూడా నిర్వహించడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియా జలాల్లో డ్రాగన్ దేశం మోహరించిన ఆరు యుద్ధనౌకల్లో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ జిబో, ఫ్రిగో జింగ్జౌ కూడా ఉన్నాయి. సోమాలియాకు ఉత్తరాన గల్ఫ్ ఆఫ్ ఏడెన్కు ఆరునెలల క్రితం చేరిన చైనా టాస్క్ఫోర్స్ ప్రధాన బాధ్యత షిప్పింగ్ మిషన్లకు ఎస్కార్ట్గా నిలవడమే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న దశలో చైనా యుద్ధనౌకల మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా ఉనికి పెరుగుతున్న తరుణంలో ఈ వార్తలు వెలుగుచూశాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడి అనంతరం అమెరికా తన అత్యాధునిక విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను, దానికి అనుబంధంగా ఉండే యుద్ధ బృందాన్ని తూర్పు మధ్యధరాకు పంపింది.
మరో యుద్ధనౌక యూఎస్ఎస్ మౌంట్ విట్నీని కూడా మోహరించనున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. అమెరికా, చైనా దేశాల యుద్ధనౌకల మోహరింపుతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం దరిమిలా అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా ఇరుదేశాలు తమ నౌకలను మోహరిస్తుండటంతో పరిస్థితి ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.