China rocked by Cooking oil contamination scandal: వంటనూనెల నాణ్యత కుంభకోణం ప్రస్తుతం చైనాను కుదిపేస్తుంది. వాటి రవాణా కోసం ఉపయోగించిన విధానాలు ఆ దేశవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారాయి. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను రవాణా చేసిన కంటైనర్లను శుభ్రపర్చకుండానే వంటనూనెలు నింపి తరలించినట్లుగా భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో చైనా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
దీనితోపాటు ఇంధన రవాణాకు ఉపయోగించిన ట్యాంకర్లను కూడా వెంట నూనెలు, సిరప్ లు తరలించేందుకు వాడినట్లు గుర్తించారు. అది కూడా సరిగ్గా డీకంటామినేట్ చేయకుండానే వినియోగించినట్లు ప్రభుత్వ రంగానికి చెందిన బీజింగ్ న్యూస్ కథనంలో పేర్కొన్నది.
చైనాలో వంటనూనెను రహస్యంగా ఇలా ప్రమాదకర కంటైనర్లలో తరలిస్తున్నారంటూ సదరు పత్రిక వెల్లడించింది. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఈ పరిణామాలతో అక్కడి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ విషయం ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీబో అనే చైనా సోషల్ మీడియాలో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది పరిశీలించారు. అయితే, ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ రంగ కంపెనీలు సినోగ్రెయిన్, హోప్ ఫుల్ గ్రెయిన్ అండ్ ఆయిల్ గ్రూప్ ల పేర్లు కూడా భారీగానే వినిపిస్తున్నాయి. సినోగ్రామ్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నది. నిబంధనలను అతిక్రమించిన ట్రక్కులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. హోప్ ఫుల్ గ్రెయిన్ కూడా ఈ వ్యవహారంపై దృష్టిసారించినట్లు మరో పత్రికకు వెల్లడించింది.
Also Read: బిబిసి జర్నలిస్ట్ భార్య, ఇద్దరు కుమార్తెల హత్య.. ఎందుకు జరిగిందంటే..
అయితే, గతంలో చైనాను సన్ లూ మిల్క్ అనే ఆహార కల్తీ కుంభకోణం కుదిపేసిన విషయం తెలిసిందే. నాడు మెలామైన్ అనే కెమికల్ ను పాలపౌడర్ లో కలిపి విక్రయించడంతో 3 లక్షల మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. పలువురు చిన్నారు మృత్యువాతపడ్డారు.