Sam Altman Returns : ఓపెన్ ఏఐలో రేగిన కల్లోలం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎలాంటి నోటీసు లేకుండా తనకు ఉద్వాసన పలికిన బోర్డురూం కుట్రలను ఛేదించి ఏఐ కింగ్ శామ్ ఆల్ట్మన్ సొంతగూటికి చేరుతున్నారు. ఆ సంస్థ సీఈవోగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. శామ్ తొలగింపును నిరసిస్తూ వైదొలగిన మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మాన్ కూడా తిరిగి రానున్నారు.
శామ్ ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా బోర్డు మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు సీఈవోలను మార్చింది. ఈ నేపథ్యంలో శామ్ పున:ప్రవేశానికి సూత్రప్రాయంగా ఓ ఒప్పందం కుదిరిందంటూ ఓపెన్ ఏఐ వెల్లడించింది. అలాగే కొత్త బోర్డుకు బ్రెట్ టేలర్ సారథ్యం వహిస్తారు. ఓపెన్ ఏఐను పునర్వ్యవస్థీకరించే బాధ్యత ముగ్గురు సభ్యులతో కూడిన కొత్త బోర్డుకు అప్పగించారు.
మొత్తం 9 మంది సభ్యులు ఉండేలా బోర్డును త్వరలో విస్తరిస్తారు. అందులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఓపెన్ ఏఐలో అతి పెద్ద భాగస్వామి, పది బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. బోర్డు సభ్యునిగా కొనసాగాలని శామ్ ఆల్ట్మన్ కూడా కోరుకుంటున్నారు. అలాగే శామ్ ఉద్వాసనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. శామ్ తిరిగి రావడంపై ఓపెన్ ఏఐలో అతి పెద్ద పెట్టుబడిదారు త్రైవ్ కేపిటల్ స్వాగతించింది.