Subscription charges for Twitter soon : ఇప్పటి వరకు ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కింద ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి నెలవారీ ఛార్జీలు వసూలు చేస్తున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు యూజర్ల నుంచి కొత్త సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అది అందరికీ కాదు. వాణిజ్య ప్రకటనలు వద్దనుకున్న ట్విట్టర్ యూజర్ల నుంచి కాస్త ఎక్కువ ధరతో సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయాలనేది మస్క్ ఆలోచన. ఆర్థిక కష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలంటే… ఆదాయం పెంచుకోవడం ఒక్కటే మార్గం కావడంతో… ట్విట్టర్లో రకరకాల మార్పులు తీసుకొస్తున్నాడు… మస్క్. అందులో భాగంగానే… వాణిజ్య ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్ను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని మస్క్ తెలిపాడు.
ప్రస్తుతం ట్విట్టర్లో వాణిజ్య ప్రకటనలు చాలా తరచూ కనిపిస్తాయని, అలాగే చాలా పెద్దగా కూడా ఉంటున్నాయన్న మస్క్… కొన్ని వారాల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాడు. ధర కొంచెం ఎక్కువే అయినా… వాణిజ్య ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్ను ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కింద తీసుకురాబోతున్నామని ప్రకటించాడు. అయితే యూజర్లు అందరికీ ఇది తప్పనిసరి కాదని, ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఎలాంటి ప్రకటనలు ఉండబోవని… దీనికి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మస్క్ వెల్లడించాడు.
మస్క్ ఆలోచన అమల్లోకి వస్తే… ట్విట్టర్ వ్యాపార నమూనాలో పెద్ద మార్పు జరిగినట్లే. ఇప్పటిదాకా ఆదాయం కోసం ట్విట్టర్ ఎక్కువగా వాణిజ్య ప్రకటనలపైనే ఆధారపడుతోంది. ట్విట్టర్ను మస్క్ కొన్నాక బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ పాలసీ, ఉద్యోగుల తొలగింపు వంటి మార్పులు తీసుకురావడంతో… చాలా కంపెనీలు ట్విట్టర్కు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. దాంతో… సంస్థ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం మస్క్… ట్విట్టర్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో… అన్నీ చేస్తున్నారు. ఆయన చర్యల్ని కొందరు స్వాగతిస్తుంటే… మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. కానీ వేటినీ పట్టించుకోని మస్క్… తన పని తాను చేసుకుపోతున్నాడు.
Follow this link for more updates:- Bigtv