Threat calls to Indian Community In Canada : కెనడాలోని గ్యాంగ్స్టర్ల నుంచి భారతీయ కమ్యూనిటీ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of External Affairs) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. భారతీయ పౌరులకు దోపిడీ కాల్స్ రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు.
భారతదేశం-కెనడా చర్చించడానికి అనేక సమస్యలు ఉన్నాయని రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతంలో ఒక ఆలయంపై దాడి జరిగింది. కెనడియన్ పోలీసులు ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో విచారణకు వెళ్లారు. ఆలయంలోకి చొరబడిన ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదని ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయన్నారు.
ఇండో-కెనడియన్ కమ్యూనిటీ సభ్యుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. ఈ ఫిర్యాదులపై కెనడా ప్రభుత్వం ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కెనడా పోలీసులు ప్రస్తుతం ఇలాంటి తొమ్మిది ఘటనలపై విచారణ జరుపుతున్నారు.
తన దేశ గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను హతమార్చడంలో న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశం ఈ వాదనలు వాస్తవంకాదని పేర్కొంది.