carbon : దేశాలన్నీ మొద్దు నిద్ర వీడి కర్బన ఉద్గారాలను తగ్గించాలని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కళ్లెం వేయాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 12 వరకు దుబాయ్లో
ప్రపంచ పర్యావరణ సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్-కాప్28) జరగనుంది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యావరణ మార్పుల అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
అత్యధికంగా కర్బన వాయువులను వెదజల్లుతున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు దేశాలు కలిపి 2021లో 52% మేర కార్బన్-డై-ఆక్సైడ్ వాయువులను వెలువర్చాయి.
తలసరి ప్రకారం చూస్తే అమెరికా టాప్లో నిలిచింది. అగ్రరాజ్యంలో తలసరి 15.32 మెట్రిక్ టన్నుల CO2 వెలువడుతోంది. చైనా 7.44 మెట్రిక్ టన్నులు, ఇండియా 1.89 మెట్రిక టన్నులతో అమెరికా కన్నా దిగువనే ఉన్నాయి.
మొత్తం ఎమిషన్స్లో రష్యా వాటా 4.7%, జపాన్ 2.9 శాతంతో 4, 5 స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్, ఇటలీ, పోలెండ్ దేశాల్లో కర్బన ఉద్గారాల బెడద తక్కువే. ఆ మూడు దేశాల్లో 0.9% చొప్పున CO2 విడుదలవుతోంది.
పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నఉష్ణోగ్రతలే ఇందుకు నిదర్శనం.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో పర్యావరణ మార్పులు అనివార్యమవుతున్నాయి. ఫలితంగా హిమానీనదాలు(Glaciers) కరిగిపోతున్నాయి. గ్రీన్లాండ్ను ఒకప్పుడు 20 వేల గ్లేసియర్లు కప్పేసి ఉండేవి. పెరూ కూడా అంతే. గత ఆరుదశాబ్దాల్లో సగానికి పైగా కరిగిపోయాయి.
ఆర్కిటిక్ ప్రాంతం 1.00 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర మంచుఫలకాలను కోల్పోయింది. అంటార్కిటికా ఐస్ 1981-2010 మధ్య వేగంగా కరిగిపోయింది. మొత్తం 2.6 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర మంచు మాయమైంది.
దుబాయ్ నేత్వత్వంలో ఈ సారి జరగనున్న కాప్-28 సదస్సులోనైనా ఓ పరిష్కారం లభిస్తుందని పర్యావరణ నిపుణులు ఆశిస్తున్నారు. 198 దేశాల నుంచి 70 వేల మందికి పైగా ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. పర్యావరణ మార్పులతో చితికిపోయే పేద దేశాలు, ఇతర కమ్యూనిటీల రక్షణ, పునరావాస కల్పనకు నిధుల సమీకరణపై కాప్-28 ప్రధానంగా దృష్టి సారించనుంది.