California : అమెరికాలో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రం తీరప్రాంతంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. మూడు రోజులుగా తీరానికి సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. పలువురు గాయపడ్డారు.
సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో అలలు వస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. వెంచురాలో సముద్రపు అలలు 10 మందిని ఈడ్చుకుపోతుంటే కాపాడినట్లు అగ్నిమాపక సిబ్దంది చెబుతున్నారు. అలల తాకిడి కారణంగా ఎనిమిది మంది ఆస్పత్రి పాలయ్యారు.
భారీ అలల ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాలను మూసివేశారు. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో వ్యాపార సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. ఇక్కడ చాలా ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లలోకి నీరు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి తీరప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. హెర్మోస, మాన్హట్టన్, పాలోస్ వెర్డోస్ బీచ్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాలిఫోర్నియా తీరప్రాంతంలో నిన్న తుపాను ప్రభావంతో భారీగా అలలు ఎగసిపడ్డాయి. కాలిఫోర్నియా, ఓరెగాన్ తీరప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ ఆలల ప్రభావాన్ని చవిచూస్తునట్లు అధికారులు చెబుతున్నారు. తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి..సహాయ చర్యలు అందిస్తున్నారు.