Oswal Daughter Uganda| ప్రముఖ బిలియనీర్ బిజినెస్ మెన్ పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధరా ఓస్వాల్ ని ఉగాండా ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా అదుపులోకి తీసుకుందని.. ఇది కిడ్నాపింగ్ లాంటిదే అని ఆయన ఐక్యరాజ్యసమితిలో అప్పీల్ చేశారు. తన కూతురు వసుంధరా ఓస్వాల్ (26)ని ఉగాండాలోని తన లిక్కర్ ఫ్యాక్టరీ నుంచి 20 మంది అధికారులు వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకున్నారని.. అరెస్ట్ చేసే సమయంలో ఎటువంటి గుర్తింపు పత్రాలు చూపించలేదని ఆయన అప్పీల్ లో పేర్కొన్నారు.
పంకజ్ ఓస్వాల్ ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఆర్బిట్రరీ డిటెన్షన్ – UNWGAD) లో సోమవారం అత్యసర అప్పీల్ ని ఫైల్ చేశారు. ఈ అప్పీల్ ప్రకారం.. ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు విచారణ కోసం ఉగాండా అధికారులు అక్టోబర్ 1న వసుంధరా ఓస్వాల్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆమెను బంధించి అమానవీయ చర్యలకు ఉగాండా అధికారులు పాల్పడ్డారు. యురోపియన్ యూనియన్ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. వసుంధరా ఓస్వాల్ కు తన కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు అనుమతులు ఇవ్వలేదు.
Also Read: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు
వసుంధరా అరెస్ట్ గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె తండ్రి పంకజ్ ఓస్వాల్ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో వసుంధరాతో ఉగాండా అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో రాశారు. ఈ పోస్ట్ లో ఆయన ఒక టాయిలెట్ ఫొటో పెట్టారు. ఆ ఫొటోలో టాయిలెట్ లో రక్తపు మరకలు, మలం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ లో తన కూతురిని 90 గంటలపాటు బంధించారని, ఆమె అయిదు రోజుల పాటు బట్టలు మార్చుకునేందుకు, స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తాగడానికి కలుషితమైన నీరు. కుళ్లిపోయిన ఆహారం, పడుకోవడనికి ఒక చిన్న బెంచ్ ఇచ్చారని.. ప్రతి రోజు నేరస్తుల పరేడ్ లో ఆమె చేత బలవంతంగా పరుగులు తీయిస్తున్నారని వెల్లడించారు.
వసుంధరా ఓస్వాల్ అరెస్ట్ గురించి ఆమె సోదరుడు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు. వసుంధరా చాలా కష్టపడి పనిచేస్తుందని.. 2021లో ఉగాండాలోని లువెరో ప్రాంతంలో చిన్న గదిలో ప్రారంభించిన ఇఎన్ లిక్కర్ కార్యకలాపాలని ఈ రోజు 110 మిలియన్ల బిజినెస్ ఫ్యాక్టరీగా మార్చిందని రాశాడు. ఉగాండాలోని తమ బిజినెస్ రైవల్ అయిన ఒక 68 ఏళ్ల వ్యక్తి కుట్ర పన్ని వసుంధరని అరెస్టు చేయించారని.. ఇదంతా ఓస్వాల్ కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టేందుకు, బిజినెస్ రంగంలో తమ కంపెనీ పరువుని దెబ్బతీసేందుకే జరుగుతోందని వెల్లడించాడు. వసుంధరని విడుదల చేయమని కోర్టు ఆదేశించినా.. పోలీసులు ఆమెను మరో హత్య కేసులో అనుమానితురాలిగా పేర్కొని విడుదల చేయలేదని అన్నారు.
ఈ కేసులో ఐక్యరాజ్యసమితి UNWGAD విభాగం విచారణ చేయడానికి అంగీకరించింది. ఉగాండా పోలీసులు అధికార దుర్వినియోగం చేయడంపై అక్కడి ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని కోరింది.