Britain: బ్రిటన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఈ క్రమంలో ప్రధాని రిషి సునాక్కు మరో చిక్కొచ్చి పడింది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దాదాపు 5 లక్షల మంది లండన్ వీధుల్లో పదర్శన నిర్వహించారు. అందులో 3 లక్షల మంది టీచర్లు ఉండగా.. మిగతా వాళ్లు సివిల్ సర్వెంట్లు, ట్రైన్ డ్రైవర్లు ఉన్నారు.
కరోనా సమయంలో, ఉక్రెయిన్.. రష్యా యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు వారు వాపోయారు. వెంటనే గతంలో మాటిచ్చినట్లుగా జీతాలు పెంచాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఇక టీచర్లు సమ్మెలో పాల్గొనడంతో దాదాపు 23 వేల పాఠశాలలపై ప్రభావం పడింది. అలాగే రైలు డ్రైవర్లు కూడా సమ్మెకు దిగడంతో ట్రైన్లన్నీ నిలిచిపోయాయి. ఈ ప్రదర్శన బ్రిటన్లో గత దశాబ్దంలో జరిగిన అతి పెద్దదిగా వర్ణిస్తున్నారు.
అయితే రెండు రోజుల క్రితమే రిషి సునాక్ తన చేతిలో ఏం మ్యాజిక్ లేదని, ఇదెప్పటికీ జరిగేది కాదని స్పష్టం చేశాడు. అలాగే సమ్మెకు దిగవొద్దని.. అది గందరగోళానికి దారి తీస్తుందని ప్రధాని కార్యాలయం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు.