Belgium : ఫిఫా వరల్డ్ కప్లో మొరాకో ఓటమిపాలవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐరోపాలోని బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో హింస చోటు చేసుకుంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు మొరాకోను 2-0తో ఓడించడంతో అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
బ్రస్సెల్స్లోని మొరాకో అభిమానులు రెచ్చిపోయారు. వంద మందితో కూడిన అల్లరిమూక వీధుల్లో విధ్వంసానికి పాల్పడింది. పోలీసులతోనూ వీరు ఘర్షణకు దిగారు. టపాసులను విసురుతూ చెత్త కుప్పలను రోడ్లపైకి తెచ్చి నిప్పు పెట్టారు.
పోలీసులు అప్రమత్తమై వీరిని అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. భాస్పవాయువును ప్రయోగించి అల్లరిమూకను చెదరగొట్టారు. అల్లర్లకు పాల్పడిన కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనలు జరుగుతున్న క్రమంలో మొరాకో అభిమాని ఒకరు రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు ఫ్రాన్స్ అభిమానులు కొందరు కారులో అక్కడికి వచ్చి యూటర్న్ తిప్పుతుండగా ఓ బాలుడు చక్రాల కింద పడిపోయాడు.
తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందాడు. ప్రపంచకప్ సెమీఫైనల్స్ సందర్భంగా ఫ్రాన్స్, బెల్జియంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. వీటిని అదుపు చేయడానికి పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.