Bangladesh: బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ లేఖలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఫిర్యాదు చేస్తూ.. బంగ్లాదేశ్ ప్రభుత్వం తన అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులను ఆదుకునేందుకు పశ్చిమ బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఇటీవల మమతా బెనర్జీ అన్నారు.
బంగ్లాదేశ్ లో ఉద్యగో రిజర్వేషన్లపై జరుగుతున్న హింసాకాండ సమయంలో మమతా బెనర్జీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పట్ల మాకు ఎంతో గౌరవభావం ఉంది. కానీ మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళానికి కారణమవుతున్నాయి. వాటి వల్ల మా దేశ గౌరవానికి భంగం కలిగించేలా అనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాశాం” అని అన్నారు.
మమతా బెనర్జీ ఏమన్నారు?
1993లో కోల్ కతా ఫైరింగ్ ఘటన లో చనిపోయిన వారికి గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 21న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా జూలై 21, 2024న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ”పొరుగు దేశంలో హింసాత్మక ఘటనల వల్ల జనజీవనం ప్రభావితమవుతోంది. అక్కడి నుంచి శరణు కోరుతూ మా రాష్ట్రానికి వచ్చిన వారికోసం బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం.. మానవ సంక్షోభ సమయాల్లో ఎవరైనా పక్క రాజ్యాలు లేదా పక్క దేశాల నుంచి వచ్చిన ప్రజలకు ఆదుకోవాలి. అయితే బంగ్లాదేశ్ రాజకీయాలపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. అది వారి అంతర్గత విషయం. దీనిపై కేంద్ర ప్రభుత్వమే స్పందించాలి. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వచ్చేవారికి ఆదుకుంటాం.. కానీ వారు తిరిగి వెళ్లేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు,” అని ఆమె అన్నారు.
Also Read: అరుదైన కేసుల్లోనే బెయిల్ ఆర్డర్పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు
బంగ్లాదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా 70 శాతానికి పెంచాలని జూన్ లో హైకోర్టు తీర్పు వెలువరించడంతో అక్కడ విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు నిరసనలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన బంగ్లా ఉద్యమకారులకు 50 శాతం రిజర్వేషన్ పెంచాలని ఆ తీర్పులో ఉండడంతో విద్యార్థులు రోడ్డునెక్కారు. అయితే నిరసనలు చేస్తున్న విద్యార్థులందరికీ అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతు ఉంది. దీంతో ప్రతిపక్షం ముస్లిం లీగ్ పార్టీ విద్యార్థులు నిరసనలు చేస్తున్న వారితో గొడవలకు దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలై రాళ్లు రువ్వుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ దాడుల్లో 160 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.
అయితే రిజర్వేషన్ విషయంలో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కలగచేసుకుంటూ.. హై కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. రిజర్వేషన్ నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని సూచనలు చేసింది.