Sheikh Haina: షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ను కోరింది. హసీనాపై బంగ్లాలో హత్యా అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను డిమాండ్ చేసింది.
షేక్ హసీనాకు పొరుగు దేశం ఆశ్రయం కల్పించడం విచారకరం. ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్కు అప్పగించండి. పలు కేసుల్లో ఆమెను విచారించేందుకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆమెను విచారణ ఎదుర్కోనివ్వండి అని బీఎన్పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రల్ ఇస్లాం పేర్కొన్నారు.
హసీనాపై 31 కేసులు:
విద్యార్థులు చేపట్టిన రిజర్వేషన్ల ఆందోళనలో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. ఈ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. వారి కుటుంబ సభ్యుల మరణాలకు హసీనా కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హసీనాపై ఇప్పటి వరకు 31 కేసు నమోదయ్యాయి. ఇందులో 26 హత్య అభియోగాలు కూడా ఉన్నాయి. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్కు సంబంధించిన మరో కేసు కూడా ఆమెకు నమోదైంది.
Also Read: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన
బంగ్లాదేశ్ అల్లర్ల కారణంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన హసీనా కుటుంబ సభ్యులు, ఆమె కుమారుడు సాజీత్ వాజెద్, కుమార్తె సైమా వాజెద్ సోదరి షేక్ రెహానాను హత్య కేసుల్లో నిందితులుగా చేర్చారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను హసీనాను తమ దేవానికి అప్పగించాలని డిమాండ్ చేసింది.