Bangladesh Hindus Massive Rally| బంగ్లాదేశ్ సంక్షోభం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. తాజాగా లక్షలాది మైనారిటీ ప్రజలు ముఖ్యంగా హిందువులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో శనివారం రోడ్లపై నిరసన చేశారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయిన తరువాత బంగ్లాదేశ్ లో విద్యార్థుల ముసుగులో అల్లరిమూకలు అరాచకం సృష్టిస్తున్నాయి. ప్రతినాయకులు, హిందూ ప్రజలపై దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం గత వారం రోజులుగా జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా మైనారిటీ ప్రజల ఇళ్లపై.. హిందువుల దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 52 జిల్లాల్లోని హిందువులు, క్రిస్టియన్లు, బౌద్దులపై 205 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో కొంతమంది చనిపోయారని.. వందలమందికి తీవ్ర గాయాలయ్యాయని సమచారం. చనిపోయిన వారిలో ఇద్దరు షేక్ హసీనా పార్టీకి చెందిన హిందూ నాయకులు ఉండడం గమనార్హం.
ఈ దాడులకు వ్యతిరేకంగా.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాన రహదారులపై హిందువులు నిరసనలు చేశారు. కొంతమంది ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు కూడా హిందువులకు మద్దతుగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. దాదాపు 7 లక్షల మంది హిందువులు ఢాకాలోని షాహ్ బాగ్ ప్రాంతంలో నిరసనలు చేశారని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు చిట్టగాంగ్ నగరంలో కూడా వేల సంఖ్యలో హిందువులు నిరసనలు చేశారని తెలిసింది.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని, మైనారిటీలకు పార్లమెంటులో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మైనారిటీల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్ లో కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.
మరోవైపు బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనుస్ మైనారిటీలపై జరిగే దాడులను నీచమైన చర్యగా అభివర్ణించారు. షేక్ హసీనాని దేశ నుంచి గెంటివేసిన విద్యార్థి నిరసనకారులపై.. మైనారిటీలను కాపాడే బాధ్యత ఉందని.. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం మైనారిటీలు కూడా పోరాడారని గుర్తుచేశారు.
Also Read: సుప్రీం కోర్టులో ‘లాపతా లేడీస్’ ప్రత్యేక స్క్రీనింగ్.. కుటుంబ సమేతంగా తిలకించిన న్యాయమూర్తులు!